‘సబ్బండ వర్ణాల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నది.. మైనార్టీలోని పేదలు ఆర్థికంగా బలోపేతం కావాలన్న సదుద్దేశంతోనే రాష్ట్ర సర్కార్ రూ.లక్ష సాయం అందజేస్తున్నది..’ అని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. శనివారం రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్లోని బేగమ్స్ ఇండియా గార్డెన్లో మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో తొలివిడుతలో భాగంగా 584 మంది మైనార్టీలకు రూ.5.84 కోట్ల విలువైన చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. వికారాబాద్ జిల్లా.. పరిగిలో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి మైనార్టీలకు రూ.లక్ష చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముస్లిం మైనార్టీ విద్యార్థుల కోసం 204 పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు. షాదీ ముబారక్ ద్వారా తొమ్మిదేండ్లలో రెండున్నర లక్షల మంది అర్హుల పెండ్లిళ్లకు మొత్తం రూ.2,130 కోట్లు ప్రభుత్వం అందజేసిందని తెలిపారు.
– ఇబ్రహీంపట్నం, ఆగస్టు 19
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 19 : ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్లోని బేగమ్స్ ఇండియా గార్డెన్లో మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో శనివారం మైనార్టీలకు ఎకనామిక్ సపోర్ట్ వందశాతం సబ్సిడీ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని మహేశ్వరం, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం, షాద్నగర్, చేవెళ్ల, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, కల్వకుర్తి నియోజకవర్గాలకు సంబంధించి తొలి విడుతలో ఎంపిక చేసిన 584 మంది మైనార్టీ లబ్ధిదారులకు రూ.5.84 కోట్ల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాశ్గౌడ్, అంజయ్యయాదవ్, యాదయ్యతో కలిసి మంత్రి సబితారెడ్డి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. సకల జనుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనిక పాలన, తెలంగాణలో హిందూ ముస్లిం ఐక్యతను పటిష్టం చేస్తూ, గంగా జమునా తహెజీబ్ను కాపాడుతూ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న సెక్యులర్ వైఖరి తెలంగాణలో మతసామరస్యాన్ని చాటి చెబుతున్నదని తెలిపారు.
బడ్జెట్లో మైనార్టీలకు ప్రాధాన్యం
మైనార్టీల సంక్షేమం కోసం దేశంలోని ఏ రాష్ట్రమూ తెలంగాణ స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు చేయలేదని మంత్రి సబితారెడ్డి చెప్పారు. ముస్లిం మైనార్టీల సంఖ్య కోటిన్నర జనాభా ఉన్న మహారాష్ట్రలో బడ్జెట్లో మాత్రం రూ.674 కోట్లు కేటాయిస్తే, 50 లక్షల జనాభా ఉన్న తెలంగాణలో రూ.2,200 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత వీరి సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ పదివేల కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ముస్లిం మైనార్టీ విద్యార్థుల కోసం 204 పాఠశాలలు ఏర్పాటుచేసి నాణ్యమైన విద్యనందిస్తూ ముస్లిం యువతను రేపటి పౌరులుగా తీర్చిదిద్దుతున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ఉర్దూతోపాటు ఇంగ్లిష్ మీడియంలో బోధన జరుపుతూ భవిష్యత్తులో ఉద్యోగ ఉపాధి రంగాల్లో అవకాశాలు దక్కేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
మైనార్టీల్లోని పేదలు సొంత వ్యాపారాలు నిర్వహించుకోవడానికి రూ.లక్ష ఉచిత గ్రాంటును అందజేస్తున్నట్టు తెలిపారు. ఈ పథకాన్ని త్వరలోనే దశలవారీగా లక్ష మంది అర్హులకు అందజేస్తామని వెల్లడించారు. షాదీ ముబారక్ ద్వారా తొమ్మిదేండ్లలో రెండున్నర లక్షల మంది అర్హుల పెండ్లిళ్లకు మొత్తం రూ.2,130 కోట్లు ప్రభుత్వం అందజేసిందని తెలిపారు. తెలంగాణలో 9 ఏండ్లలో హిందూముస్లింల మధ్య ఒక్కటంటే ఒక్క చిన్న గొడవ కూడా కాకుండా సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతున్నదని చెప్పారు. రాష్ట్రంలో 24 గంటలు నాణ్యమైన కరెంటు అందుబాటులో ఉన్నదని, ప్రతి ఇంటికీ నల్లాతో నీళ్లు అందుతున్నాయని చెప్పారు. షాదీ ముబారక్, రైతు బంధు వంటి పలు పథకాల ద్వారా ముస్లిం మైనార్టీల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని తెలిపారు. తెలంగాణ మోడల్ పాలన నేడు దేశవ్యాప్తంగా కావాలని డిమాండ్ పెరిగిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దయానంద్, మైనార్టీ సంక్షేమశాఖ అధికారి నవీన్కుమార్ ఉన్నారు.
మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
పరిగి, ఆగస్టు 19 : మైనార్టీల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషిచేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. శనివారం పరిగిలో ప్రభుత్వం ద్వారా మంజూరైన మైనార్టీలకు లక్ష రూపాయల రుణాల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధి కోసం లక్షరూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని తెలిపారు. బీసీ బంధు ద్వారా బీసీల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ప్రభుత్వం.. దళిత బంధు ద్వారా దళిత కుటుంబాల్లో, మైనార్టీలలో లక్ష సహాయాన్ని అందించి వారి అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. రాష్ట్రంలోని ప్రజలకు అభివృద్ధి ఫలాలను అందించే దిశగా ప్రభుత్వం కృషిచేస్తున్నదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, జడ్పీటీసీ హరిప్రియ, ఏఎంసీ చైర్మన్ సురేందర్కుమార్, ఎంపీపీలు, మండలాల నాయకులు, కౌన్సిలర్లు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.