మర్పల్లి, నవంబర్ 12: ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తాపడిన ప్రమాదంలో 35 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన మర్పల్లి మండలంలోని గుర్రంగట్టు తండా సమీపంలో శుక్రవారం జరిగింది. ప్రయాణికులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డి డిపోకు చెందిన టీఎస్15యుడీ 6441 నంబరు గల ఆర్టీసీ బస్సు సంగారెడ్డి నుంచి మోమిన్పేట, మర్పల్లి మీదుగా సుమారు 60మందికి పైగా ప్రయాణికులతో తాండూరుకు వెళ్తున్నది. మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో గుర్రంగట్టు తండా సమీపంలోని మూల మలుపు వద్ద అతివేగంతో వెళ్తున్న బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కన పడిపోయింది. డ్రైవర్ బుజంగం, కండక్టర్ రాజమణితోపాటు బస్సులోని 35 మందికిపైగా ప్రయాణికులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, తహసీల్దార్ తులసీరామ్ ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనం, ప్రైవేట్ వాహనాల్లో మర్పల్లి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో రాజమణి (సంగారెడ్డి), లింగమ్మ (మొరంగపల్లి), నాగమ్మ (క్యాసారం), శాంతమ్మ (సదాశివపేట్), ఆస్మా (తాండూరు), సువర్ణ (పెద్దపూర్), రేహన్ (పెద్దెము ల్), రవళికలను సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానకు 108 వాహనంలో తరలించారు. వారిలో రాజమణి, నాగమ్మల పరిస్థితి విషమంగా ఉందన్నా రు. అదేవిధంగా బంట్వారం మండలం మాల సోమారం గ్రామానికి చెందిన ఆరుగురు యాద మ్మ, రాజు, మంగళి లక్ష్మయ్య, రవీందర్, ఎండీ. షామిమ్, లక్షయ్య చేతులు, తల, శరీరంపై గాయాలయ్యాయి. డ్రైవర్ అజాగ్రత్తగా నడపడంతోనే బస్సు బోల్తా పడిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. కాగా బస్సు పూర్తిగా దెబ్బతిన్నది.
బస్సు ప్రమాద ఘటనపై మంత్రి సబితారెడ్డి ఆరా
వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం గుర్రంగట్టు తండా వద్ద ఆర్టీసీ బస్సు బోల్తాపడిన ఘట నపై విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు ప్రమాద ఘటనపై మంత్రి ఆరా తీసి సహాయక చర్యల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, ఎప్పటికపుడు వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని మంత్రి సబితారెడ్డి ఆదేశించారు.