బడంగ్పేట్, నవంబర్ 1 : బీఆర్ఎస్ను ఆదరించి అభివృద్ధికి పట్టం కట్టాలని, తన బలం.. బలగం.. నియోజకవర్గ ప్రజలేనని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం మహేశ్వరం మండల పరిధిలోని తుక్కుగూడకు చెందిన బీజేపీ బీసీ మోర్చా అధ్యక్షుడు బంటు రమేశ్ తన అనుచరులతో కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించి మహిళల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. మంత్రికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అఖండ స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికలు రాగానే పెట్రోల్, గ్యాస్ ధరలను పెంచకుండా.. తిరిగి ఎన్నికల ఫలితాలు రాగానే ధరలు పెంచుతుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టోనే కాకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేది ఒక్క కేసీఆరే అని తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే గ్యాస్ సిలిండర్ను రూ.400లకే అందజేస్తామన్నారు. మహేశ్వరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు కొనసాగాలంటే తిరిగి బీఆర్ఎస్ పార్టీ గెలవాలన్నారు. నియోజకవర్గంలో సబితమ్మ బలగాన్ని చూసి మహేశ్వరం సీటు కోసం ప్రతిపక్ష పార్టీలు ఢిల్లీలో చర్చిస్తున్నాయన్నారు. బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని ఆదరించి మరోసారి మీ ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు.
ఈ 30 రోజులు తన కోసం పనిచేస్తే.. ఐదు సంవత్సరాలు మీ కోసం సేవ చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో రైతు బీమాలాగ 93 లక్షల మందికి కేసీఆర్ బీమా కల్పించనున్నారని తెలిపారు. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రాగానే మహిళలకు రూ.3000 ఆర్థిక సహాయం అందజేస్తామని తెలిపారు. ప్రతి గడపకు రాజకీయాలకతీతంగా సంక్షేమ ఫలాలు అందుతున్నాయని చెప్పారు.
శంషాబాద్ నుంచి తుక్కుగూడ మీదుగా కందుకూరు వరకు రూ.6600 కోట్లతో మెట్రో నిర్మాణం చేపడుతామని ఆమె తెలిపారు. మరో హైటెక్ సిటీగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణగా మారిందని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ భవాని, కౌన్సిలర్లు రవినాయక్, లావణ్య, తేజస్విని, సుమన్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు లక్ష్మయ్య, యూత్ అధ్యక్షుడు సామ్యూల్రాజు, నాయకుడు సురేశ్ పాల్గొన్నారు.