ఉత్తమ గ్రామ పంచాయతీలకు రూ.10లక్షల చొప్పున నిధులు మంజూరు చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. శనివారం మద్గుల్చిట్టంపల్లిలోని డీపీఆర్సీ భవనంలో జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశం, జిల్లాస్థాయి ఉత్తమ గ్రామ పంచాయతీ పురస్కారాల పంపిణీ కార్యక్రమాలకు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లాలో ఉత్తమ అవార్డులకు ఎంపికైన 27 గ్రామ పంచాయతీలకు పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వడగండ్ల వానతో నష్టపోయిన రైతులందరికీ 10 వేల చొప్పున నష్టపరిహారం అందనుందన్నారు. జిల్లాలో ‘కంటి వెలుగు’ కింద ఇప్పటివరకు 2,13,907 మందికి కంటి పరీక్షలు చేసినట్లు తెలిపారు.
-వికారాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ)
వికారాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ) : జాతీయ పంచాయతీ అవార్డుల్లో భాగంగా జిల్లాలోని 27 గ్రామపంచాయతీలు ఉత్తమ గ్రామపంచాయతీలుగా ఎంపికయ్యాయని మంత్రి సబితారెడ్డి తెలిపారు. శనివారం మద్గుల్ చిట్టంపల్లిలోని డీపీఆర్సీ భవనంలో జిల్లాస్థాయి ఉత్తమ గ్రామపంచాయతీ పురస్కారాల పంపిణీ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాస్థాయి ఉత్తమ గ్రామపంచాయతీలుగా ఎంపికైన 27 గ్రామపంచాయతీల అభివృద్ధికి ఒక్కో గ్రామపంచాయతీకి రూ.10 లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పల్లెప్రగతి కార్యక్రమంతో తెలంగాణలోని పల్లెల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని తెలిపారు.
గ్రామాల్లో పల్లెప్రకృతివనాలు, నర్సరీలు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు, 24 గంటల విద్యుత్తు, వైకుంఠధామాలు, హరితహారం తదితర కార్యక్రమాలతో ప్రజలు పట్టణాల నుంచి పల్లెలకు వలస వస్తున్నారన్నారు. దేశవ్యాప్తంగా టాప్-20 ఉత్తమ గ్రామాల్లో 19 గ్రామపంచాయతీలు తెలంగాణ నుంచే ఎంపిక కావడం, యావత్ తెలంగాణ సర్పంచ్ల విజయమన్నారు. గతంలో గ్రామాలకు వెళ్తే చెత్త స్వాగతం పలికేదని, కానీ సీఎం కేసీఆర్ ప్రత్యేక విజన్తో చేపట్టిన పల్లెప్రగతితో స్వచ్ఛ గ్రామాలుగా మారిపోయాయన్నారు. జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల సర్పంచులు బాగా పనిచేస్తున్నారని, మిగతా గ్రామపంచాయతీల సర్పంచులు వీరిని ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్యేలు ఆనంద్, యాదయ్య, మహేశ్రెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ రాహుల్శర్మ, డీసీసీబీ చైర్మన్ మనోహర్రెడ్డి, జడ్పీ సీఈవో జానకీరెడ్డి పాల్గొన్నారు.
ఉత్తమ గ్రామపంచాయతీగా మెట్లకుంట
బొంరాస్పేట : మండలంలోని మెట్లకుంట గ్రామపంచాయతీ జల్లాస్థాయిలో ఉత్తమ గ్రామపంచాయతీగా ఎంపికైంది. హెల్తీ పంచాయత్ థీమ్లో దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారానికి మెట్లకుంట గ్రామాన్ని జిల్లా అధికారులు ఉత్తమ జీపీగా ఎంపిక చేశారు. శనివారం జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ కావలి నారాయణ, పంచాయతీ కార్యదర్శి సిద్దయ్యకు మంత్రి సబితారెడ్డి, డీపీవో తరుణ్కుమార్ ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ హేమీబాయి, జడ్పీటీసీ చౌహాన్ అరుణాదేశు, ఎంపీడీవో పాండు సర్పంచ్, కార్యదర్శిని అభినందించారు.
హస్నాబాద్ గ్రామపంచాయతీకి అవార్డు
కొడంగల్ : మండలంలోని హస్నాబాద్ గ్రామపంచాయతీ జిల్లాస్థాయి అవార్డుకు ఎంపికైంది. శనివారం జిల్లా కేంద్రంలో మంత్రి సబితారెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి ద్వారా సర్పంచ్ ఫకీరప్పతోపాటు పంచాయతీ కార్యదర్శి కృష్ణవేణి అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సర్పంచ్ను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ నాగరాణి, ఎంపీడీవో పాండు, బీఆర్ఎస్ నాయకులు సిద్దిలింగప్ప, రాములు పాల్గొన్నారు.
జిల్లా ఉత్తమ గ్రామపంచాయతీగా చాపలగూడెం
కులకచర్ల : మండలంలోని చాపలగూడెం ఉత్తమ గ్రామపంచాయతీగా ఎంపికైంది. ఈ సందర్భంగా సర్పంచ్ గండి లక్ష్మణ్ను మంత్రి సబితారెడ్డి సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ సత్యమ్మ, జడ్పీటీసీ రాందాస్నాయక్ ఉన్నారు.
సీపీఆర్తో నిండు ప్రాణాన్ని కాపాడుదాం
ఇటీవల వయస్సుతో సంబంధం లేకుండా చాలామంది గుండెపోటుతో చనిపోతున్నారని, వారికి సకాలంలో సీపీఆర్ నిర్వహిస్తే ప్రాణాలను రక్షించవచ్చని సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారని మంత్రి సబితారెడ్డి తెలిపారు. శనివారం మద్గుల్ చిట్టంపల్లిలోని డీపీఆర్సీ భవనంలో సీపీఆర్ శిక్షణా కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా తర్వాత చిన్న వయస్సు వారికి కూడా గుండెపోటు వస్తున్నదని.. వైద్యుడి కోసం ఎదురుచూడకుండా తక్షణమే సీపీఆర్ నిర్వహిస్తే మరణాలు తగ్గించవచ్చన్నారు.
గుండెపోటుతో కుప్పకూలితే వెంటనే 108కి సమాచారమివ్వాలని, అంబులెన్స్ వచ్చేలోగా సీపీఆర్ చేస్తూ, ఊపిరి అందించినట్లయితే ఒక నిండు జీవితాన్ని, కుటుంబాన్ని కాపాడినవారమవుతామన్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సర్వసభ్య సమావేశాలు, అంగన్వాడీలు, స్వయం సహాయక సంఘాల సభ్యులకు సీపీఆర్పై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ.. జిల్లాలో శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనర్స్తో శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలిపారు. సీపీఆర్ నిర్వహించే ముందు ఆ వ్యక్తి గుండెపోటుకు గురయ్యారా లేదా అనేది గుర్తించాలని సూచించడంతోపాటు సీపీఆర్ ఎలా చేయాలనే దానిపై ప్రజాప్రతినిధులు, అధికారులకు అవగాహన కల్పించారు.