షాబాద్, జనవరి 26: రాష్ట్ర ప్రజల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రత్నామ్నాయ విద్యుత్ ఉత్పత్తికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లాలోని షాబాద్ మండలంలోని చందనవెల్లి పారిశ్రామిక వాడలో నూతనంగా ఏర్పాటు చేసిన జున్నా సోలార్ పవర్ ప్యానెల్ ఉత్పత్తి ప్లాంటును ఆయన ప్రారంభించారు. అనంతరం సోలార్ పవర్ ప్యానెల్ ఉత్పత్తి విధానం గురించి అక్కడ ఉన్న ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు.
సోలార్ ప్యానెల్ ఉత్పత్తికి సంబంధించి గ్లాస్ లోడింగ్,ల్యామినేటింగ్ ఫ్రేమింగ్, క్యూరింగ్ లైన్, క్లీనింగ్ సెక్షన్, ఐపోర్టు, ఫైనల్ ఈ.ఎల్ ప్రాసెస్ యూనిట్స్ను పరిశీలించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. 2030 సంవత్సరం నాటికి ప్రజలకు ఉన్న డిమాండ్కు అనుగుణంగా ప్రత్యామ్నాయ విద్యుత్ను ఉత్పత్తి చేస్తామన్నారు.
ప్రపంచంలో మానవజాతికి విద్యుత్ శక్తికి మధ్య విడదీయరాని బంధం ఏర్పడిందన్నారు. విద్యుత్ శక్తి వినియోగం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో డిమాండ్కు అనుగుణంగా ప్రత్యామ్నాయంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా సౌరశక్తి, పవనశక్తి, హైడెల్, చెత్త నుంచి తయారు చేసే విద్యుత్ను ఉత్పత్తి చేస్తూ ప్రజల అవసరాలు తీర్చుతామని చెప్పారు.
ఇప్పుడున్న థర్మల్ విద్యుత్కు ప్రత్యామ్నాయ మార్గాలతో అధిక విద్యుత్ ఉత్పత్తిని పెంచుతామన్నారు. ప్రత్నామ్నాయ విద్యుత్ను దేశ ప్రజలకు అందించేందుకు దివంగత ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీ వేసిన పునాదులు దేశవ్యాప్తంగా ప్రజల అవసరాలను తీరుస్తుందన్నారు. భవిష్యత్తు ప్రజల అవసరాలను తీర్చే విధంగా స్థాపించిన ఈ కంపెనీ వృద్ధి చెందాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. అంతకుముందు హైతాబాద్ చౌరస్తాలో కొద్దిసేపు ఆగిన భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ నాయకులు గజమాలతో సత్కరించారు.
అనంతరం పక్కనే ఉన్న భూనిర్వాసితులతో కొద్ది సేపు మాట్లాడారు. ఇక్కడ ఏర్పాటు చేస్తున్న కంపెనీల్లో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా కృషి చేస్తామని తెలిపారు. చందనవెల్లి గ్రామ సర్వే నంబర్ 190లో చేసిన భూసేకరణలో నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చూస్తానని భూ నిర్వాసితులకు భరోసా ఇచ్చారు. స్థానికంగా ఏర్పాటు చేసిన పరిశ్రమల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, చేవెళ్ల ఆర్డీవో సాయిరాం, షాబాద్ తహసీల్దార్ చిన్నప్పలనాయుడు, విద్యుత్ శాఖ ఏడీ స్వామి, ఏఈ నరేందర్, సోలార్ పవర్ ప్యానెల్ ప్లాంట్ నిర్వాహకులు శేఖర్రెడ్డి, బస్వీరెడ్డి, ఈదుల నరేందర్రెడ్డి, భీమవరపు అనిల్కుమార్రెడ్డి, దుర్గాప్రసాద్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, పీసీసీ రాష్ట్ర కార్యదర్శులు ఎలుగంటి మధుసూదన్రెడ్డి, పీసరి సురేందర్రెడ్డి, చేవెళ్ల నియోజకవర్గ ఇంచార్జి పామెన భీంభరత్, మండల పార్టీ అధ్యక్షుడు కావలి చంద్రశేఖర్, సర్పంచులు ప్రభాకర్రెడ్డి, నరేందర్రెడ్డి, రవీందర్, ఎంపీటీసీలు జయమ్మ, ఆశోక్ తదితరులు పాల్గొన్నారు.