షాద్నగర్, జనవరి 11 : ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర పాలన కొనసాగుతున్నదని హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. బుధవారం చౌదరిగూడలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో 42 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేసిన సందర్భంగా మాట్లాడారు. రాష్ట్రంలోని వేలాది మంది లబ్ధిదారులకు షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను అందజేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని తెలిపారు. పేద ఆడబిడ్డల పెండ్లి భారం కావద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం తలపెట్టిన ఈ పథకాలను పేదలు సంపూర్ణంగా సద్వినియోగం చేసుకుంటున్నారని ఆయన తెలిపారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలను బలోపేతం చేయడంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రపంచస్థాయి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ సేవలు ఉత్తమ ఫలితాలను ఇస్తున్నాయని పేర్కొన్నారు. పోలీస్ శాఖలో ఉద్యోగాలను పూర్తిస్థాయిలో భర్తీచేసేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. త్వరలోనే ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ ప్రధాన రాతపరీక్షలను పూర్తిచేసిన తర్వాత అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు.
ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మాట్లాడుతూ.. ముస్లింల సంక్షేమానికి అవసరమైన షాదీఖానాలు, ఈద్గాల ప్రహరీల నిర్మాణాలను నిర్మించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కిందన్నారు. మైనార్టీ విద్యార్థులు ఉన్నత చదువుల్లో రాణించాలనే ఉద్దేశంతో ఒక్కో విద్యార్థికి ప్రతి యేట సుమారు రూ.1.20 లక్షలను ఖర్చు చేసి గురుకుల పాఠశాలల ద్వారా విద్యనందిస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీవో రాజేశ్వరి, జడ్పీటీసీ స్వరూప, నాయకులు దామోదర్రెడ్డి, రాజేశ్పటేల్, రాములు, రామకృష్ణ ఉన్నారు.
సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ
చౌదరిగూడలో పర్వతాపూర్ గ్రామానికి చెందిన వడ్ల శంకరయ్యకు రూ.1.50 లక్షలు, ముష్టిపల్లి గ్రామానికి చెందిన యాదమ్మకు రూ.28 వేలు, నాగరాజుకు రూ.30 వేలు, మిర్యాల రామస్వామికి రూ.24 వేలు, వనంపల్లి గ్రామానికి చెందిన మీసాల నవ్యకు రూ.60 వేలు, పీర్జాపూర్ గ్రామానికి చెందిన నర్సింహులుకు రూ.60 వేల చెక్కులను ఆర్థిక సాయంగా అందించామని ఎమ్మెల్యే తెలిపారు. లబ్ధిదారులు ఈ సాయంతో లబ్ధిపొందాలని సూచించారు.