‘రేవంత్.. నువ్వు పైసలతో ప్రజలను కొనలేవ్.. సీఎం కేసీఆర్ పేదలను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారు.. ప్రజలు బీఆర్ఎస్ వెంటే ఉన్నారు’ అని మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం కొడంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్రెడ్డికి మద్దతుగా కొడంగల్ పట్టణంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ 55 ఏండ్లలో చేయలేని అభివృద్ధిని ఎమ్మెల్యే నరేందర్రెడ్డి ఐదేండ్లలో చేసి చూపించారన్నారు. నరేందర్రెడ్డిని మరోసారి గెలిపిస్తే ప్రమోషన్ ఇప్పించే బాధ్యత తీసుకుంటానని హామీనిచ్చారు. రేవంత్రెడ్డి ఓటుకు నోటుతో అడ్డంగా దొరికిపోయి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కొడంగల్ పరువు తీశాడన్నారు.
కాంగ్రెస్ టికెట్లను అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నాడని, ఆ డబ్బుతోనే నేడు కొడంగల్లో సర్పంచ్లు, ఎంపీటీసీలను కొనడానికి ప్రయత్నిస్తున్నాడని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పైసలు పంచితే తీసుకొని ఓటు మాత్రం బీఆర్ఎస్కే వేసి అభివృద్ధిని ఆశీర్వదించాలన్నారు. రెండేండ్లలో కొడంగల్కు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నుంచి సాగునీరందిస్తామన్నారు. కొడంగల్లో వంద ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. నియోజకవర్గంలో రెవెన్యూ డివిజన్తోపాటు మద్దూరును మున్సిపాలిటీగా చేస్తామని హామీనిచ్చారు.
-కొడంగల్, నవంబర్ 9
కొడంగల్, నవంబర్ 9 : పట్నం నరేందర్రెడ్డిని రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కైనా సరే ప్రమోషన్ ఇప్పిస్తానని పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం కొడంగల్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పట్నం నరేందరెడ్డికి మద్దతుగా కొడంగల్ పట్టణంలో ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిదిన్నరేండ్లలో తెలంగాణ రాష్ట్రం అన్నింటా అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. పేదలను కడుపులో పెట్టుకొని సీఎం కేసీఆర్ కాపాడుతున్నారన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు అక్కడి ప్రజ లు నేడు చెంపలేసుకుంటున్నారని.. తెలంగాణ బిడ్డలు ఆ తప్పు చేయొద్దని కన్నడ ప్రజలు కొడంగల్కు వచ్చి చెప్పుకొంటున్న విషయాన్ని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.
ఓటు కు నోటుతో అడ్డంగా దొరికిపోయి రేవంత్రెడ్డి కొడంగల్ పరువు ప్రతిష్ఠను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తీశాడని మండిపడ్డారు. 20 ఏండ్ల కిందట రేవంత్రెడ్డి సున్నా లు వేసుకొని బతికేవాడని.. బ్లాక్మెయిల్, బ్రోకర్, సెటిల్మెంట్ దందాలతో రూ. కోట్లు సంపాదించాడన్నారు. పీసీసీ పదవిని కొనుక్కోని, కాంగ్రెస్ టికెట్లను అమ్ముకుని.. ఆ డబ్బు తోనే నేడు కొడంగల్ నియోజకవర్గంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులను కొంటున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు గిరిజన సర్పంచ్లను కొనేందుకు చేసిన ప్రయత్నాన్ని తిప్పికొట్టి పోలీసులకు పట్టించిన బొంరాస్పేట సర్పంచ్ నర్సింగ్నాయక్ను మంత్రి అభినందించారు. రేవంత్రెడ్డీ.. లీడర్లను కొనవచ్చేమో కానీ.. మా తెలంగాణ బిడ్డలను కొనే దమ్ము నీకు లేదని మంత్రి హెచ్చరించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో కొడంగల్లో లక్షా 25 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు.
మరో రెండేండ్లలో కొడంగల్కు పాలమూరు-రంగారెడ్డి నీటిని తీసుకొస్తామని స్పష్టం చేశారు. గడిచిన ఐదేండ్లలో రెండేండ్లపాటు కరోనా మహమ్మారితో అభివృద్ధి ఆగిపోయిందని.. మిగిలిన మూడేండ్ల కాలంలో కోట్లాది రూపాయల నిధులతో కొడంగల్ అభ్యున్నతికి కృషి చేసినట్లు తెలిపారు. 55 ఏండ్లలో జరుగని అభివృద్ధిని ఐదేండ్లలో చేసినట్లు తెలిపారు. నేడు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, తండాల్లో బీటీ, సీసీ రోడ్లు, డిగ్రీ, జూనియర్ కళాశాలలు, 50, 30 పడకల ఆసుపత్రులు, రెండు మున్సిపాలిటీలు, మూడు కొత్త మండలాలు వంటి ఎన్నో సదుపాయాలు అందుబాటులోకి వచ్చినట్లు గుర్తుచేశారు. కొడంగల్లో అభివృద్ధి చేసిన దాఖలాలు లేకపోవడంతో ప్రజలు ఎక్కడ నిలదీస్తారనే భయంతో కాంగ్రెస్ నాయకులు రాత్రివేళల్లో ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
రేవంత్రెడ్డి సంపాదన పాపపు సంపాదన కాబట్టి కాంగ్రెస్ నాయకులు ఎంత ఇస్తే అంత తీసుకోండి.. కానీ కారు గుర్తుకు ఓటేసి పట్నం నరేందర్రెడ్డిని మరోసారి ఆశీర్వదించాలని ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులకు మంత్రి కేటీఆర్ సూచించారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఏనాడూ కులం, మతం పేరుతో పంచాయితీలు పెట్టలేదని.. అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలను అందిస్తూ అండగా ఉంటున్నదన్నారు. నరేందర్రెడ్డిని గెలిపిస్తే మద్దూర్ మండలాన్ని మున్సిపాలిటీగా.. నియోకజవర్గంలో ఒక రెవెన్యూ డివిజన్, ప్రభుత్వ ఇంజినీరింగ్, నర్సింగ్ కళాశాలలు, వంద ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీచ్చారు. రైతుబంధు కావాలా..రాబంధువులు కావాలా..? ప్రజల మధ్యన ఉండే నాయకుడు కావాలా..? చేతులూపే నాయకుడు కావాలో ప్రజలు తేల్చుకోవాలని సూచించారు.
మంత్రి కేటీఆర్ రోడ్షో భారీ జన సందోహం మధ్య సూపర్ సక్సెస్ అయ్యింది. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో కొడంగల్ నియోజకవర్గంలోని అంబేద్కర్ కూడలి కిక్కిరిసిపోయింది. పట్టణ శివారులోని బండల ఎల్లమ్మ ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు మంత్రి హెలికాప్టర్ ద్వారా చేరుకోగా.. అక్కడి నుంచి అంబేద్కర్ కూడలి వరకు భారీ ర్యాలీతో వెళ్లారు. గ్రామల నుంచి జనాలు ప్రత్యేక వాహనాలు, బైక్లపై రోడ్ షోకు తరలివచ్చారు. మంత్రి రోడ్ షోతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొన్నది.
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో ప్రభంజనాన్ని సృష్టించనున్నదని.. ముచ్చటగా మూడోసారి కూడా సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధిస్తారని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి అన్నారు. మంత్రి కేటీఆర్ కొడంగల్ను దత్తత తీసుకొన్న తర్వాత నియోజకవర్గ రూపురేఖలే మారిపోయాయన్నారు. కోట్లాది రూపాయల నిధులతో అన్ని వసతులు సమకూరినట్లు గుర్తుచేశారు. గతంలో రేవంత్రెడ్డి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచినా కొడంగల్ ప్రజలకు ఎటువంటి మేలు చేయలేదన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధిని సాధించి నేడు దేశానికే రోల్ మాడల్గా నిలిచిందన్నారు. రైతన్నలకు అందించిన సంక్షేమ ఫలాలతో నేడు తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా మారిందన్నారు. 2018 ముందు కొడంగల్ అన్నింటా వెనుబడి ఉండేదని.. అప్పట్లోనే రూ.300 కోట్లు మంజూరు చేయించి అత్యవసరమైన గ్రామాలకు బీటీ రోట్లను వేయించినట్లు గుర్తు చేశారు. ప్రజలు కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని.. కాంగ్రెస్ తో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడుతుందని.. ఆలోచించి అభివృద్ధికి ఓటు వేయాలన్నారు.
-పట్నం మహేందర్రెడ్డి, సమాచార శాఖ మంత్రి
2018 ముందు కొడంగల్ అన్నింటా వెనుకబడి ఉందని.. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే నియోజకవర్గాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో రూ.950కోట్లు మంజూరు చేసినట్లు బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో కొత్తగా 47 తండాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయని, ఆనాటి నుంచే తండాల అభివృద్ధికి శ్రీకారం పడిందన్నారు. ప్రస్తుతం అన్ని తండాల్లోనూ బీటీ, సీసీ రోడ్ల నిర్మాణంతోపాటు ఇంటింటికీ శుద్ధి చేసి మిషన్ భగీరథ తాగునీరు సరఫరా అవుతున్నదన్నారు. గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్రెడ్డి నియోజకవర్గాభివృద్ధిని గాలికి వదిలేశారని మండిపడ్డారు.
నేడు జరిగిన అభివృద్ధి ఆయన కండ్లకు కనిపించడంలేదని.. నామినేషన్ దాఖలు చేసే సమయంలో కొడంగల్ ఏమీ అభివృద్ధి చెందలేదని ఆయన మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రేవంత్రెడ్డికి కండ్లు కనిపించడం లేదని.. కొడంగల్లో ఉండి చూస్తే అభివృద్ధి ఎంత జరిగిందో తెలిసేదన్నారు. ఆరు నెలలకోసారి వచ్చే అతడికి అభివృద్ధి అంటే ఏమిటో ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. ఓడిపోతున్నాననే భయంతోనే నేడు గుర్నాథ్రెడ్డిని ఆశ్రయించాడని ఎద్దేవా చేశారు. మరోమారు ఆశీర్వదిస్తే కొడంగల్ను ఆదర్శ సెగ్మెంట్గా మార్చుతానని..పరిశ్రమల ఏర్పాటు కోసం ఇప్పటికే 100 ఎకరాల స్థలాన్ని సేకరిచినట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.