రంగారెడ్డి, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : చేనేతకు మరింత ప్రాచుర్యం కల్పించడంలో భాగంగా ప్రభుత్వం ప్రత్యేక సంబురాల నిర్వహణకు నిర్ణయించింది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 7వ తేదీ నుంచి 14 వరకు ప్రభుత్వం వారోత్సవాలను నిర్వహిస్తున్నది. ఈ మేరకు సోమవారం మన్నెగూడలో చేనేత సంబురాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. చేనేత దుస్తులను ధరించి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి నేతన్నలు తరలిరాగా.. సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా చేనేతకు మరింత చేయూతనిచ్చేందుకు మంత్రి కేటీఆర్ వరాల జల్లు కురిపించగా.. నేతన్నల కుటుంబాలు చప్పట్లు, ఈలలతో మద్దతు తెలిపారు. ఈ వేదికగా మంత్రి కేటీఆర్ కొత్త పథకాలను ప్రకటించడంతోపాటు గతంలో ఉన్న పథకాల కింద ఇస్తున్న సాయాన్ని పెంచుతున్నట్లు చెప్పారు.
జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వారోత్సవాలను నిర్వహిస్తున్నది. ఈ నెల 7 నుంచి 14 వరకు అన్ని జిల్లాల్లోనూ అట్టహాసంగా నిర్వహించాలని రాష్ట్ర చేనేత, జౌళి శాఖల మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో నిర్వహించిన చేనేత సంబురాలు కోలాహల వాతావరణంలో ప్రారంభమయ్యాయి. మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చేనేత దుస్తులను ధరించి వచ్చిన మంత్రి సంబురాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చేనేతకు మరింత చేయూతనిచ్చేందుకు మంత్రి కేటీఆర్ వరాల జల్లు కురిపించగా.. నేతన్నలు చప్పట్లు, ఈలలతో మద్దతు తెలిపారు.
చేనేత కార్మికులను ఆదుకునేందుకు పలు పథకాలు
విప్లవాత్మకమైన కార్యక్రమాలతో దేశంలోనే తెలంగాణ చేనేత రంగం ఆదర్శంగా నిలుస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం సైతం చేనేత సంక్షేమాన్ని పరిరక్షించేలా దేశంలో ఎక్కడాలేని విధంగా పథకాలను అమలు చేసి కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. మంత్రి కేటీఆర్ చేనేత పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అప్పుల ఊబిలో చిక్కుకుని ఆత్మహత్యలపాలవుతున్న చేనేత కార్మికులను ఆదుకునేందుకు అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. బడ్జెట్లోనూ ప్రభుత్వం పెద్దఎత్తున నిధులను కేటాయించి నేతన్నల సంక్షేమానికి పాటుపడుతున్నది. వృత్తిపై ఆధారపడ్డ నేతన్నలను గుర్తించి మగ్గాలను జియో ట్యాగింగ్ చేసింది. రైతులకు మాదిరిగా బీమా పథకంతోపాటు నేతన్నకు చేయూత, త్రిఫ్ట్ వంటి పథకాలను అమలు చేస్తున్నది. చేనేత వస్ర్తాలకు విశేష ఆదరణ కలిగించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు విధిగా చేనేత వస్ర్తాలు ధరించాలన్న సూచనలతో కార్మికులకు ఉపాధి సైతం పెరిగింది. చేనేతకు మరింత ప్రాచుర్యం కల్పించడంలో భాగంగా మంత్రి కేటీఆర్ చేనేత సంబురాల నిర్వహణకు పిలుపునివ్వడంతో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు, అధికారులు మన్నెగూడలో నిర్వహించిన వేడుకల్లో పాలుపంచుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి సైతం నేతన్నలు పెద్దఎత్తున తరలివచ్చి సంబురాల్లో పాల్గొన్నారు.
వరాలతో సర్వత్రా హర్షాతిరేకాలు
మన్నెగూడ వేదికగా మంత్రి కేటీఆర్ కొత్త పథకాలను ప్రకటించారు. అలాగే గతంలో ఉన్న పథకాల కింద ఇస్తున్న సాయాన్ని పెంచుతూ వరాలు గుప్పించారు. వరాలతో నేతన్నలో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. 75 ఏండ్ల వారికి కూడా బీమాను వర్తింపజేస్తామని మంత్రి ప్రకటించారు. చేనేత మగ్గం పథకాన్ని మన్నెగూడ వేదికగా ప్రారంభించిన మంత్రి నేటి నుంచే ఈ పథకం అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు. కార్మికుల ఆరోగ్యంతోపాటు చేనేత వస్ర్తాల నైపుణ్యతను మరింతగా పెంపొందింపజేసేందుకు రూ.40.50 కోట్లతో ఫ్రేమ్ మగ్గాలను అందజేయనున్నట్లు ప్రకటించారు. ఆరోగ్య కార్డుల ద్వారా ప్రతి కుటుంబానికి ఏటా రూ.25వేల పరిమితి మేరకు వైద్య సేవలందిస్తామని చెప్పి నేతన్న కుటుంబాలకు భరోసా కల్పించారు. చేనేత మిత్ర పథకం ద్వారా ప్రతి కార్మికుని ఖాతాలో నెలనెలా రూ.3 వేలు జమ, కార్మికులు చనిపోతే టెస్కో ద్వారా అందించే పరిహారాన్ని రూ.12,500 నుంచి రూ.25 వేలకు పెంచడం, డీసీసీబీ ద్వారా క్యాష్ క్రెడిట్ను కల్పిస్తామని చేసిన ప్రకటనలు కార్మికుల్లో సంతోషాన్ని నింపాయి. చేనేత రంగంపై మంత్రి వరాల జల్లు కురిపించిన సందర్భంలో నేతన్నల నుంచి విశేష స్పందన వచ్చింది. చప్పట్లు, ఈలలతో సంబురాల వేదిక ప్రాంగణం మార్మోగింది.
మన్నెగూడలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన చేనేత సంబురాల్లో రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, చేనేత, జౌళి శాఖ కార్యదర్శి జ్యోతిబుద్దప్రకాశ్, హ్యాండ్లూం చైర్మన్ చింత ప్రభాకర్, పవర్లూం చైర్మన్ గూడూరు ప్రభాకర్, జౌళి శాఖ కార్యదర్శి వర్షిణి పాల్గొన్నారు.