ఉమ్మడిజిల్లాలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను పూర్తిచేసి, రూపురేఖలు మార్చనున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఓఆర్ఆర్పై 20వ ఇంటర్చేంజ్ను ప్రారంభించిన అనంతరం మంత్రి జిల్లాపై వరాల జల్లు కురిపించారు. మూసీపై 14 చోట్ల బ్రిడ్జీలు మంజూరయ్యాయని, ఐదుచోట్ల పనులు టెండర్ల దశలో ఉన్నాయని తెలిపారు. పదివేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మూసీపై 55 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్వే నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. మెట్రో రైలు సౌకర్యం మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలనే వినతులు వస్తున్నాయని, రాయదుర్గం శంషాబాద్ మార్గాన్ని రెండున్నరేండ్లలో పూర్తి చేస్తామన్నారు. బీహెచ్ఈఎల్ నుంచి కందుకూరుకు మెట్రోను విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఆగస్టు 15 నాటికి ఔటర్ వెంట సోలార్ రూఫ్తో సైక్లింగ్ ట్రాక్ అందుబాటులోకి తేస్తామని తెలిపారు.కోకాపేటలో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంటు ప్రారంభించుకున్నామని, మరో రెండు నెలల్లో వందశాతం సీవరేజ్ ట్రీట్మెంట్ చేస్తున్న నగరంగా మనం ఘనత సాధించబోతున్నామని ప్రజల హర్షధ్వానాల మధ్య మంత్రి కేటీఆర్ వివరించారు.
సిటీబ్యూరో, జూలై 1 (నమస్తే తెలంగాణ): దేశంలోని ఏ మెట్రో నగరానికి లేని ప్రత్యేకత సెప్టెంబర్ నాటికి మన హైదరాబాద్కు రానున్నదని ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. హైదరాబాద్ నగరంలో నిత్యం దాదాపుగా రెండువేల ఎంఎల్డీల మురుగు ఉత్పత్తి అవుతున్నదని.. ఈ సెప్టెంబర్ నాటికి నగరంలో ఉత్పత్తి అయ్యే ప్రతి మురుగునీటి చుక్కనూ శుద్ధి చేసి వందశాతం మురుగును శుద్ధి చేసే తొలి నగరంగా హైదరాబాద్ అవతరిస్తుందని పేర్కొన్నారు. శనివారం మంత్రి సబితాఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్లతో కలిసి ఆయన రూ. 41 కోట్ల తో కోకాపేటలో 15 ఎంఎల్డీ సామర్థ్యంతో నిర్మించిన ఎస్టీపీని అదేవిధంగా నార్సింగిలో రూ.29.50 కోట్లతో హెచ్ఎండీఏ నిర్మించిన ఇంటర్చేంజ్ను ప్రారంభించారు. కార్యక్రమంలో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్కుమార్, హెచ్ఎండీఏ డైరెక్టర్ ప్రభాకర్, చీఫ్ ఇంజినీర్, హెచ్జీసీఎల్ ఎండీ బీఎల్ఎన్రెడ్డి, ప్లానింగ్ డైరెక్టర్ బాలకృష్ణ, సీజీఎం రవీందర్, ఎస్ఈలు హుస్సేన్, పరంజ్యోతి, నార్సింగి ఇంటర్చేంజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అప్పారావు, అధికారులు పాల్గొన్నారు.
జలమండలి అధికారులకు అభినందన
రూ.3,866 కోట్లతో 31 మురుగునీటి శుద్ధి ప్లాంట్ల (ఎస్టీపీ) నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, అందులో మొదటిది కోకాపేటలో 15 ఎంఎల్డీ సామర్థ్యంతో ఎస్టీపీని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. వందశాతం మురుగుశుద్ధి అనేది దేశంలోని ఏ మెట్రో నగరంలోనూ లేద ని అలాంటి సాహసాన్ని మన నగరంలో చేస్తున్నామన్నారు. ఇతర మెట్రోనగరాల్లో 40 శాతం కూడా మురుగుశుద్ధి జరుగడంలేదన్నారు. వందశాతం మురుగునీటి శుద్ధ్దికి కృషి చేస్తున్న జలమండలి ఎండీ దానకిశోర్, ఈడీ సత్యనారాయణ, అధికారుల బృందాన్ని మంత్రి కేటీఆర్ అభినందించారు.
మారనున్న రంగారెడ్డి రూపురేఖలు
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరానికి ఔటర్ రింగు రోడ్డు ఎంతో ఉపయుక్తంగా ఉందని.. ఔటర్ చుట్టూ పెరుగుతున్న జనసాంద్రతను దృష్టిలో పెట్టుకుని మౌలిక వసతులను కల్పిస్తున్నామని, మరికొన్ని ఇంటర్చేంజ్లను కూడా నిర్మిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. త్వరలో ఔటర్పై 21వ ఇంటర్చేంజ్ మల్లంపేట వద్ద అందుబాటులోకి రానున్నదన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సర్వీస్ రోడ్లను నాలుగు లేన్లుగా విస్తరించనున్నట్లు తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను పూర్తిచేసి రూపురేఖలను పూర్తిగా మార్చుతామన్నారు. మెట్రోరైలు సౌకర్యాన్ని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని వినతులు వస్తున్నాయని పేర్కొన్నారు. రాయదుర్గం-శంషాబాద్ మార్గాన్ని రెండున్నరేండ్లలో పూర్తి చేస్తామన్నారు. బీహెచ్ఈఎల్ నుంచి ఫార్మాసిటీకి మెట్రోను విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. మూసీనది అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని.. త్వరలోనే మూసీపై 14 బ్రిడ్జిలను నిర్మిస్తామని..ఐదు చోట్ల పనులు టెండర్ల దశలో ఉన్నాయన్నారు. రూ.పది వేల కోట్లతో 55 కిలోమీటర్ల మేర ఎక్స్ప్రెస్వేను నిర్మిస్తామన్నారు.