ఆదిబట్ల, ఫిబ్రవరి 9: ఎట్టకేలకు ఆదిబట్ల మున్సిపాలిటీ చైర్పర్సన్ కొత్త ఆర్తిక.. వైస్ చైర్పర్సన్ కళమ్మపై కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. గత నెల రోజులుగా ఆదిబట్ల మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్పై అవిశ్వాసం పెట్టాలని కాంగ్రెస్కు చెందిన ఆరుగురు, బీజేపీకి చెందిన ఒకరు, బీఆర్ఎస్కు చెందిన ఆరుగురు కౌన్సిలర్లు మొత్తం 13 మంది తీర్మానం చేసి రంగారెడ్డి కలెక్టర్కు ఆ కాపీని అందించారు. దీంతో కలెక్టర్ ఈ నెల 9న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించి 15 మంది కౌన్సిలర్లకు నోటీసులు జారీ చేశారు. శుక్రవారం ఉదయం 10-30 గంటలకు చైర్పర్సన్పై.. 12 గంటలకు వైస్ చైర్పర్సన్పై ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి నేతృత్వంలో సమావేశం ఏర్పాటు చేశారు.
ఇందులో చైర్పర్సన్ కొత్త ఆర్తిక, వైస్ చైర్పర్సన్ కళమ్మపై అవిశ్వాసం పెట్టేందుకు 13మంది కౌన్సిలర్లు ఆమోదం తెలపడంతో అవిశ్వాస తీర్మానం నెగ్గింది. చైర్పర్సన్ వైస్చైర్పర్సన్పై పెట్టిన అవిశ్వాస తీర్మానం కాపీలపై సభ్యులు సంతకాలు చేసి ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డికి అందజేశారు. అప్పటికే చైర్పర్సన్ సమావేశ మందిరం నుంచి బయటికెళ్తూ నాలుగేండ్ల కాలంలో తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని కంటతడి పెట్టారు. వైస్ చైర్పర్సన్ మాత్రం ఈ సమావేశానికి హాజరుకాలేదు. ఈ సందర్భంగా ఆర్డీవో అనంతరెడ్డి మాట్లాడుతూ త్వరలోనే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక తేదీని ప్రభుత్వం ప్రకటిస్తుందని.. అప్పటివరకు మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ బాధ్యతలు నిర్వహిస్తారన్నారు.
అవిశ్వాసం పెట్టేందుకు 13మంది కౌన్సిలర్లు ఆమోదం తెలపడంతో ఆదిబట్ల మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీలో కోల్డ్వార్ కొనసాగింది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వర్సెస్ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిలు రెండు గ్రూపులుగా విడిపోయారు. మంత్రి కోమటిరెడ్డి మర్రి నిరంజన్రెడ్డికి అండగా ఉండగా.. మల్రెడ్డి రంగారెడ్డి ఆదిబట్ల మున్సిపల్ చైర్పర్సన్ ఆర్తికకు సపోర్టు చేశారు. కాగా మర్రి నిరంజన్రెడ్డి ఆదిబట్ల మున్సిపల్ చైర్మన్ పదవిని ఆశించి కాంగ్రెస్కు చెందిన ఆరుగురు, బీజేపీకి చెందిన ఒకరు, బీఆర్ఎస్కు చెందిన ఆరుగురు కౌన్సిలర్లు మొత్తం 13 మందితో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లపై అవిశ్వాసానికి తెరలేపారు. కలెక్టర్కు అవిశ్వాసం పెట్టాలని తీర్మాన కాపీని అందిం చి తనకు మద్దతుగా ఉన్న 12 మంది కౌన్సిలర్లను క్యాంపులకు తరలించారు.
సొంత పార్టీకి చెందిన చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లపై నిరంజన్రెడ్డి అవిశ్వాసాన్ని పెట్టించినందుకు కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకున్నది. షోకాజ్ నోటీస్ జారీ చేసినా స్పందించకపోవడంతో నాలుగు రోజుల క్రితం అతడిని పార్టీని నుంచి సస్పెండ్ చేసింది. కాగా శుక్రవారం నిర్వహించిన సమావేశంలో మర్రి నిరంజన్రెడ్డి అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గి తన పంతాన్ని నిలబెట్టుకున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా పోలీసులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, ఇబ్రహీంపట్నం ఏసీపీ శ్రీనివాస్రావు, ఆదిబట్ల సీఐ రాఘవేందర్రెడ్డి ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకున్నారు.
ఆదిబట్ల మున్సిపల్ చైర్పర్సన్, వైస్చైర్పర్సన్పై పెట్టిన అవిశ్వాస తీర్మానం బల పరీక్షకు హాజరైన సభ్యులు మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లగానే చైర్పర్సన్ ఆర్తిక తన వర్గంతో ఒక్కసారిగా ఆ కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించింది. దీంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. కాసేపు మున్సిపాలిటీ ఎదుట స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకున్నది. పోలీసులు వారిని వాహనాల్లో పీఎస్కు తరలించారు.