సిద్దిపేట ప్రతినిధి/ సిద్దిపేట అర్బన్, మార్చి 29 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్రం రాక ముందు, ఇప్పుడు ఎంతో మార్పు వచ్చిందని..ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రజల బతుకులు మారుతున్నాయని మంత్రి హరీశ్రావు అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని నల్లపోచమ్మ సమీపంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముందుగా నల్లపోచమ్మతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సమావేశానికి కవి గాయకుడు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, సంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీతో కలిసి బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. 60 ఏండ్ల నుంచి రాని తెలంగాణ ఇప్పుడొస్తదా..? అని చాలామంది అనేక రకాలుగా మాట్లాడారని.. కానీ, వారి అంచనాలు పటా పంచాలు చేసి కేసీఆర్ తెలంగాణ సాధించి చూపెట్టాడన్నారు. తెలంగాణ రాకముందు. వచ్చిన తర్వాత పరిస్థితులు ఏ విధంగా మారాయో మీరే చూస్తున్నారన్నారు. నాటికి నేటికీ జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉందన్నారు. గత ప్రభుత్వాల హయాంలో విద్యుత్ విషయంలో రైతులు ఏవిధంగా గోస పడ్డారో చూశామన్నారు. నాడు కరెంట్ ఉంటే వార్త అని.. నేడు కరెంట్ పోతే వార్త అన్నారు. నాడు ట్రాన్స్ఫార్మర్లు కావాలంటే టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో లంచం అడిగే వారని.. కానీ, నేడు బిస్కెట్ల మాదిరి ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చామన్నారు. రైతుల కోసం నెలకు 2 వేల కోట్లు ఖర్చుచేసి ఉచితంగా విద్యుత్ ఇస్తున్నామన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బాయికాడ మీటర్లు పెడితే రూ.30 వేల కోట్లు ఇస్తామని చెప్పిందన్నారు. కానీ, సీఎం కేసీఆర్ తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మీటర్లు పెట్టనని చెప్పారన్నారు. గత ప్రభుత్వ హయాంలో సిద్దిపేటకు రావాలంటే ఊరు ఊరుకు ఖాళీ బిందెలు దాటుకొని నంగునూరుకు వచ్చే పరిస్థితి ఉండేదన్నారు. ఇవ్వాళ మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ శుద్ధమైన నీరు సరఫరా చేసి మహిళల గోస తీర్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. కలలోనైనా నంగునూరు పెద్దవాగు మండుటెండలో మత్తడి దుంకుతుందని ఊహించామా.. 24గంటల కరెంట్, ఆడబిడ్డల కల్యాణలక్ష్మి పథకం, రైతుబంధు కింద ఎకరానికి రూ.10 వేలు, రైతుబీమా ద్వారా రూ.5 లక్షలు వస్తాయని అనుకున్నామా అని మంత్రి హరీశ్రావు అన్నారు. కలలో కూడా ఊహించని పనులు సీఎం కేసీఆర్ చేసి చూపించారన్నారు. 15 ఏండ్లు కష్టపడి కౌడాయపల్లి ఫీడర్ చానల్ కడితే ఒక్క చుక్క నీరు రాలేదని, తెలంగాణ వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాతనే నిండుకుండలా మారి చెరువులు, కుంటలు మత్తళ్లు దుంకుతున్నాయన్నారు. తెలంగాణ రాకపోతే ఇవన్నీ అవుతుండేనా అన్నారు. నంగునూరు మండలంలో ఎక్కడ చూసినా పచ్చని పంట పొలాలే కనిపిస్తున్నాయన్నారు. యాసంగిలో మండలంలో 18 వేల ఎకరాల్లో వరి పంటలు సాగవుతున్నాయన్నారు. గతంలో పనిలేక ప్రజలు పొట్టచేత పట్టుకొని బొంబాయి, దుబాయికి వెళ్లేవారన్నారు. కానీ, నేడు ఛత్తీస్గఢ్, బీహార్ రాష్ర్టాల నుంచే కాకుండా నేపాల్ దేశం నుంచి వరి నాట్లు వేసేందుకు కూలీలు వస్తున్నారని మంత్రి హరీశ్రావు తెలిపారు.
– ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్
రాష్ట్రం వచ్చిన కొత్తలో మంత్రి హరీశ్రావును చూస్తే నది నడిచొచ్చినట్లు, వాగు పారుతున్నట్లు అనిపించేదని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. ఇవాళ హరీశ్రావును ఆరోగ్యశాఖ మంత్రిగా చూస్తే భుజం మీద చేయి వేసి ‘మీ ఆరోగ్యం.. మా బాధ్యత’ అన్నట్లు అనిపిస్తున్నదన్నారు. ఆ మెడలో ఉన్న గులాబీ కండువాను చూస్తే స్టెతస్కోప్లా అనిపిస్తున్నదన్నారు. ఆనాడు నీటికి, నేడు ఆరోగ్యానికి ఆయన భరోసా ఇస్తున్నారని కొనియాడారు. తాను మొదటగా ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఊరు, చాలా ప్రేమను పంచిన ప్రదేశం నంగునూరు అని గుర్తుచేశారు. తరగతి గదిలోనే నాటి తెలంగాణ సమస్యలు కనిపించాయని, నాడు ఎవుసంలో ఎన్ని తిప్పలు ఉండేవో విద్యార్థులను చూస్తేనే తెలిసిందన్నారు. నాటి పేద రైతుల దుఖం ప్రజలకు వివరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. నాడు ఎండకాలమైనా.. వానకాలమైనా.. ఎండకాలం లాగానే ఉండేదన్నారు. చెరువులు బాగు చేసుకుంటేనే రైతులు బాగుంటారని ‘మిషన్ కాకతీయ’ పేరుతో సీఎం కేసీఆర్ చెరువులను బాగుచేశారన్నారు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్తో మండుటెండల్లో చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయని తెలిపారు. అణగారిన వర్గాల ఉద్యమకారులకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. తనను గుర్తించి సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం గొప్ప విషయమని దేశపతి కృతజ్ఞతలు తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ మన కుటుంబమని.. ఇది కన్నతల్లి లాంటి పార్టీ అని.. అందరం కలిసి పని చేద్దామని మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. ఏదైనా గ్రామాలు, మండలంలో చిన్న చిన్న పొరపాట్లు జరిగితే మనమే పరిష్కరించుకోవాలని సూచించారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ దేశమంతటా విస్తరిస్తున్నదని, జాతీయ స్థాయిలో కేసీఆర్ రావాలని.. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని నినదిస్తున్నారన్నారు. ఇంకా బాగా పనిచేసి తల్లిలాంటి పార్టీని బలోపేతం చేద్దామని, సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నాడు ఉద్యమంలో తెలంగాణ మొత్తం తిరిగి పని చేశామని, రాబోయే రోజుల్లో దేశంలో ఎక్కడైనా వెళ్లి పనిచేసే విధంగా సిద్ధపడాలన్నారు. సిద్దిపేట మట్టి బిడ్డ కేసీఆర్ అని, కేసీఆర్ ఎంత ఎదిగితే మనకు అంత లాభమన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లింగంగౌడ్, జడ్పీటీసీ తడిసిన ఉమ, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ వంగ నాగిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు జాప శ్రీకాంత్రెడ్డి, ఎడ్ల సోమిరెడ్డి, వేముల వెంకట్రెడ్డి, దువ్వల మల్లయ్య, రమేశ్గౌడ్, మహిపాల్రెడ్డి, రాగుల సారయ్య, సంగు పురేందర్, రామచంద్రారెడ్డి, కృష్టారెడ్డి, స్థానిక సర్పంచ్ మమతాజయపాల్రెడ్డి, ఎంపీటీసీ కోల సునీతామహేందర్గౌడ్ పాల్గొన్నారు. కాగా ఇటీవల మృతి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తడిసిన వెంకట్రెడ్డితో పాటు కరోనా సమయంలో మృతి చెందిన పలువురు బీఆర్ఎస్ కార్యకర్తల మృతి పట్ల రెండు నిమిషాలు సభ మౌనం పాటించింది.
నంగునూరు మండలంలో చాలా పనులు చేసుకున్నామని, ఇంకా చేసుకుందామని మంత్రి హరీశ్రావు భరోసా ఇచ్చారు. చేసిన పనులు కార్యకర్తలు చెప్పుకోవాలన్నారు. ప్రజలకు ఏ ఆపద వచ్చినా మనమే ముందుంటామన్నారు. కరోనా కష్టకాలంలోనూ మనమే ముందుండి ప్రజలను కాపాడుకున్నామని గుర్తుచేశారు. సంక్రాంతి పండుగ ముందు వచ్చినట్లు ఎవరో వస్తారని, ఎన్నికలు అయిపోగానే వాళ్లు కనబడరని బీజేపీ, కాంగ్రెస్ నేతల తీరును మంత్రి ఎద్దేవా చేశారు. ప్రజాప్రతినిధులతో పాటు పార్టీ నాయకులు ప్రజలకు మన పథకాలు వివరించాలన్నారు. మహిళల కోసం కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి అమలు చేస్తున్నామని, త్వరలోనే సొంత జాగలో ఇల్లు కట్టుకునేందుకు గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. మన పిల్లల చదువుల కోసం సిద్దిపేటలో అనేక విద్యాసంస్థలు ఏర్పాటు చేశామన్నారు. నాలుగు పాలిటెక్నిక్ కళాశాలలు, పీజీ కళాశాల, ఐటీఐ, మహిళా డిగ్రీ కళాశాల, మెడికల్ కళాశాల, పారా మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల, వెటర్నరీ కళాశాల తెచ్చామన్నారు. ఈ ఏడాది బీఫార్మసీ కళాశాల ప్రారంభించుకుంటామని తెలిపారు. మనుషుల డాక్టర్, పశువుల డాక్టర్, పంటల డాక్టర్.. ఇలా అన్ని రకాల చదువులు సిద్దిపేటకు తెచ్చినట్లు మంత్రి హరీశ్రావు చెప్పారు.
‘సీఎం కేసీఆర్ గులాబీ జెండా ఎత్తింది నంగునూరు మండలం కోనాయిపల్లి వెంకన్న దీవెనలతో.. ఇక్కడి ప్రజలకు ఆత్మీయత, ప్రేమ ఎంతగానో ఉంటుంది. అందుకే మళ్లీ నంగునూరు నుంచే బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు ప్రారంభించుకున్నాం. ఆనాడు ఉద్యమంలో నంగునూరు మండల కార్యకర్తలు కేసీఆర్ వెంట నడిచి దీవిస్తే ఢిల్లీని కదిలించి తెలంగాణ రాష్ర్టాన్ని తెచ్చాడు. తెలంగాణ తెస్తడనే నమ్మకం సిద్దిపేట వాళ్లకు ఉండేది. కేసీఆర్ అంటే సిద్దిపేట .. సిద్దిపేట అంటే కేసీఆర్ అనే లాగా సిద్దిపేట గడ్డ పేరును ఆకాశాన్నంత ఎత్తులో నిలిపారు. ఇవాళ దేశం మొత్తం సీఎం కేసీఆర్ నాయకత్వం కావాలని కోరుకుంటున్నదని’ ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
– సిద్దిపేట జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ
ఏ రాష్ట్రంలో లేని విధంగా మంత్రి హరీశ్రావు, సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషితో తెలంగాణలో అనేక పథకాలు అమలవుతున్నాయని సిద్దిపేట జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆమె కార్యకర్తలకు సూచించారు. రైతుల కోసం రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలు తీసుకొచ్చారని.. మహిళల ఆరోగ్యం పట్ల మంత్రి హరీశ్రావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు. రాబోయే రోజుల్లో మండలంలోని కార్యకర్తలంతా సమష్టిగా కృషి చేసి గత ఎన్నికల కంటే ఈసారి అత్యధిక మెజార్జీని సాధించాలని కోరారు.