దుండిగల్, నవంబర్ 11 : కర్ణాటకలో వ్యవసాయానికి సరిగా కరెంట్ అందక అక్కడి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఏ ముఖం పెట్టుకుని తెలంగాణలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఓట్లు అడుగుతున్నారని మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. నగర శివారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బౌరంపేట్లోని కేఎల్హెచ్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఆపిల్ ఇన్నోవేషన్ కేంద్రాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి హరీశ్రావు మీడియాతో మాట్లాడుతూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ముందు తమ రాష్ర్టాన్ని చక్కదిద్దుకుని ఆ తర్వాత ఇక్కడ కాంగ్రెస్కు ఓటు వేయమని ప్రచారం చేయాలన్నారు. ‘మీ ఇల్లు సక్కగా లేదు.. గానీ ఇక్కడ వచ్చి నీతులు చెబుతున్నారం’టూ మండిపడ్డారు.
ఆరు నెలల కిందట కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ రాష్ట్ర ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రస్తుతం అక్కడ తాగునీరు లేదని, కరెంట్ అసలే లేదని పేర్కొన్న ఆయన.. అక్కడ ఎన్నికల్లో ఇచ్చిన ఐదు గ్యారెంటీలు అట్టర్ఫ్లాప్ అయ్యాయన్నారు. వ్యవసాయానికి కనీసం ఐదు గంటల కరెంట్ను కూడా ఇవ్వకపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే అక్కడి పరిస్థితులను చక్కదిద్దుకోవడం వారికి చాత కావడం లేదు కానీ.. తెలంగాణలో ఏ ముఖం పెట్టుకుని ఇక్కడ ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. ఇటీవల డీకే శివకుమార్ తమ రాష్ట్రంలో ఐదు గంటల కరెంట్ ఇస్తున్నట్లు చెప్పారని, కానీ తెలంగాణలో 24 గంటల నాణ్యమైన విద్యుత్ను తాము సరాఫరా చేస్తున్నామని మంత్రి హరీశ్రావు అన్నారు. కర్ణాటక నేతలు తెలంగాణ ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నారు.
కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పెట్టిన పథకాలను ఇక్కడ ఎప్పటి నుంచో అమలవుతున్నాయన్నారు. భవిష్యత్లో కాంగ్రెస్కు అధికారం కట్టబెడితే పాలనపరమైన కంట్రోల్ ఢిల్లీ, కర్ణాటక చేతుల్లోకి వెళ్తుందన్నారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్న ఢిల్లీ, కర్ణాటకకు నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కర్ణాటకతో కృష్ణా జలాలు, ఐటీ వివాదం వస్తే..మన రాష్ట్ర హక్కుల ఎవరూ కాపాడుతారన్నారు. ఇప్పటికే బ్రిజేశ్ ట్రిబ్యునల్ పంచాయతీ ఉందన్న మంత్రి.. కర్ణాటకను ధిక్కరించి మన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే ధైర్యం ఇక్కడి కాంగ్రెస్ నేతలకు ఉంటుందా…? కాళ్లు మొక్కేవాళ్లు, అడుగులకు మడుగులు ఒత్తేవాళ్లు తెలంగాణ ప్రయోజనాలు కాపాడతారా..? రాష్ట్ర ప్రజలు ఆలోచించాలన్నారు.
కర్ణాటక ఇచ్చే టికెట్లు, డబ్బులు, ప్రచారం పై ఆధారపడిన ఇక్కడి కాంగ్రెస్ నేతలు.. భవిష్యత్లో ఇక్కడి ప్రజల ప్రయోజనాలు కాపారలేరన్నారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడేది కేవలం సీఎం కేసీఆర్కు మాత్రమే సాధ్యమవుతుందన్నారు. మంత్రి కేటీఆర్ చేసిన అద్భుత కృషితో ఐటీ రంగంలో కర్ణాటకతో మనం పోటీపడుతున్నామన్నారు. గడిచిన 9 ఏండ్లుగా ఐటీ ఉత్పత్తుల్లో, ఉద్యోగాల కల్పనలో బెంగళూరును దాటి మనం ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో రాష్ర్టాన్ని కాంగ్రెస్ చేతిలో పెడితే మన ఐటీ పరిశ్రమను కర్ణాటక దెబ్బతీసే అవకాశం ఉందన్నారు. దీనిని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అడ్డుకోలేరని తెలిపారు. తెలంగాణ ప్రజలు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని, బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు సీఎం కేసీఆర్, బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందన్నారు.
అంతకు ముందు మంత్రి హరీశ్రావు కేఎల్హెచ్ యూనివర్సిటీ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఐటీ పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగాల కల్పనలో హైదరాబాద్ నగరం దేశంలోనే దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నదన్నారు. ఐదేండ్ల కాలంలో 6 లక్షల ఐటీ ఉద్యోగాలు, పారిశ్రామిక రంగంలో మరో 24 లక్షల ఉద్యోగాలు అందించాగలిగామన్నారు. తెలంగాణ ప్రజల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని అనేక పథకాలను అందుబాటులోకి తెచ్చామని, వ్యవసాయరంగంలో సైతం రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతున్నదన్నారు. యువ ఓటర్లు వాస్తవాలను గ్రహించాలని, సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని అన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఐటీ, వ్యవసాయ రంగాలను నంబర్ వన్గా తీర్చిదిద్దారన్నారు. ఈ విషయాన్ని నీతి ఆయోగ్, కేంద్ర ప్రభుత్వ సంస్థలే చెప్పాయని స్పష్టం చేశారు.
గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఆపిల్, ఫేస్బుక్ వంటి పరిశ్రమలు ఇక్కడ ఉండటం మనకు గర్వకారణమన్నారు. ఇతర ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం తరుగుతుంటే మన వద్ద 7.7 శాతం పెరిగిందన్నారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాలను నిర్మించామని స్పష్టం చేశారు. 24 గంటల కరెంట్ను ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ఈ సందర్భంగా కేఎల్హెచ్ యూనివర్సిటీలో ప్రవేశం కోసం ఈ నెల 15 నుంచి 18 వరకు నిర్వహించనున్న కేఎల్ యూనివర్సిటీ ప్రవేశపరీక్షలు మెరిట్ విద్యార్థులకు అందించే స్కాలర్షిప్ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో కేఎల్హెచ్ యూనివర్సిటీ వీసీ డా. పార్ధసారధి వర్మ, బౌరంపేట్ క్యాంపస్ ప్రిన్సిపాల్ డా. కోటేశ్వర్రావు, అజీజ్నగర్ ప్రిన్సిపాల్ డా.రామకృష్ణ, యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ డా. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.