వివిధ విభాగాలు, రికార్డుల గదులు కలియతిరిగిన మంత్రి..
పిడియాట్రిక్ కార్డియో సర్జరీ యూనిట్ ప్రారంభం
ఎమర్జెన్సీ విభాగంలో రోగులతో కుశల ప్రశ్నలు
అత్యవసర రోగులకు బెడ్స్ అందుబాటులో ఉంచాలి
ఆరోగ్యం కుదురుకుంటే.. వార్డులకు తరలించాలని సూచన
సిటీబ్యూరో, జూన్ 23 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ రంగ దవాఖానల్లోని నిమ్స్లో ఇప్పటి వరకు 5కిలోల బరువున్న పిల్లలకు మాత్రమే సర్జరీలు చేసేవారని, ఇక నుంచి గుండెకు రంధ్రం ఉన్న నవజాత శిశువులకు, 2.5 కిలోల అతి తక్కువ బరువున్న శిశువులకు కూడా శస్త్రచికిత్సలు చేయనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. త్వరలోని నిమ్స్కు పక్కనే ఉన్న ఎర్రమంజిల్ కాలనీలో ఉన్న 32ఎకరాల్లో 2000పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానను నిమ్స్కు అనుబంధంగా నిర్మించనున్నట్లు తెలిపారు. రోటరీ క్లబ్ జూబ్లీహిల్స్, సువెన్ ఫార్మాసూటికల్ సంయుక్త సహకారంతో నిమ్స్లో రూ.5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన పిడియాట్రిక్ కార్డియో సర్జరీ యూనిట్, 200 ఐసీయూ పడకలు, ఎక్మో, సీఆర్ఆర్టీ తదితరాలను ఆయన ప్రారంభించారు. నిరుపేదల కోసం నిమ్స్లో అభివృద్ధి పనులకు ఆర్థికంగా సహకరించిన రోటరీ క్లబ్ జూబ్లీహిల్స్, సువెన్ ఫార్మాసూటికల్ ప్రతినిధులకు ఈ సందర్భంగా మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి సుమారు రెండు గంటల పాటు నిమ్స్లో కలియదిరిగారు. దవాఖానలోని ఎమర్జెన్సీ బ్లాక్, ట్రామా, ఏఎంసీ, మిలీనియం బ్లాక్, ఫార్మా విభాగంతో పాటు పలు విభాగాలు, వార్డులను పరిశీలించారు. అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న రోగులను పలుకరించి, వారికి అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. ట్రామా కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడుతూ… డాక్టర్లు మంచిగ చూస్తున్నారా..? సౌలత్లు ఎట్లున్నయ్..? మందులు ఇస్తున్నారా..? అని ఆరా తీశారు. అదేవిధంగా జనరల్ మెడిసిన్, కార్డియో తదితర విభాగాల్లోని దాదాపు 25 మందికి పైగా రోగులను పరామర్శించారు. అనంతరం దవాఖానలోని రికార్డు రూమ్కు వెళ్లి రికార్డులను పరిశీలించారు.
నిమ్స్లో ఎంసీహెచ్ హాస్పిటల్..
మాతృ మరణాలను అరికట్టేందుకు నిమ్స్లో 200 పడకలతో ఎంసీహెచ్ హాస్పిటల్ను నిర్మించనున్నట్లు మంత్రి హరీశ్రావు తెలిపారు. ఇక్కడ మల్టీస్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉండటం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా హైరిస్క్ గర్భిణులకు నిమ్స్లోనే చికిత్స, ప్రసవాలు చేయడం జరుగుతుందని చెప్పారు. దీని వల్ల ఎంఎంఆర్ రేటు తగ్గుతుందని తెలిపారు. రూ.50కోట్లతో ఈ ఎంసీహెచ్ దవాఖానను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు.