కొడంగల్, అక్టోబర్ 29 : బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాల కాలంగా చేస్తున్న అభివృద్ధికి తెలంగాణ బిడ్డలు బీఆర్ఎస్ను గుండెకు హత్తుకుంటున్నారని, బీఆర్ఎస్ నాయకులను ఇంటి వ్యక్తులుగా ఆప్యాయత పంచుతున్నారని మంత్రి డా.పట్నం మహేందర్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డితో కలిసి మద్దూర్, గుండుమాల్, కోస్గి మండలాల్లో సుడిగాలి పర్యటన చేసి ముమ్మర ప్రచారం నిర్వహించారు. గుండుమాల్ మండలంలోని వీరారం పెద్ద తండావాసులు మంత్రి, ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్కే మా పూర్తి మద్దతు అంటూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గం గత 4 సంవత్సరాల ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి హయాంలో పెద్దఎత్తున అభివృద్ధి సాధ్యపడిందన్నారు.
గత 2018 ఎన్నికల్లో మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి గ్రామాన్ని, తండాల్లో పర్యటించి పరిస్థితులు చూసి చాలా బాధపడినట్లు పేర్కొన్నారు. కొడంగల్ ఎంత స్థాయిలో వెనుకబడి ఉందో గుర్తించి సీఎం దృష్టికి తీసుకెళ్లి ఆ కాలంలోనే రూ.300 కోట్ల నిధుల మంజూరుతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారన్నారు. ఆనాడు ప్రారంభమైన అభివృద్ధి ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి గెలిచిన తరువాత మరింతగా వందల కోట్ల నిధులతో నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు పెట్టినట్లు పేర్కొన్నారు. నేడు ఏ గ్రామ, తండాలను సందర్శించిన బీటీ రోడ్డు, సీసీ రోడ్లతో గ్రామ ప్రజలకు అన్నింటా సౌకర్యాలతో విరాజిల్లుతున్నట్లు పేర్కొన్నారు. నేడు ప్రజలు బీఆర్ఎస్కు మెండుగా ఆశీర్వదాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పార్టీలోకి ప్రతిపక్ష పార్టీల నాయకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గులాబీ గూటికి చేరుతున్నారని, ఇదే స్థాయిలో గుండుమాల్ మండలంలోని వీరారం తండా వాసులు బీఆర్ఎస్కే మా పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు తీర్మానం చేయడం చాలా సంతోషం వేసిందన్నారు. ఇదే మాదిరిగా మరింత స్థాయిలో గ్రామాలు కదిలోస్తే.. మోసాలకు పాల్పడే, పిట్టకథలు చెప్పే కాంగ్రెస్ నాయకులను నియోజకవర్గం నుంచి తరిమికొట్టవచ్చని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పార్టీలోనే తెలంగాణ మనుగడ ఆధారపడి ఉంది కాబట్టి ప్రజలంగా కలిసికట్టుగా బీఆర్ఎస్ గెలుపునకు కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ వస్తే చీకటి రోజులు తప్పవని.. పక్కనే ఉన్న కర్ణాటకను పరిశీలిస్తే తెలుస్తుందన్నారు. కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ను ఎందుకు గెలిపించుకున్నామని ఇప్పుడు బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల్లో వచ్చే పార్టీలను, నాయకుల మాటలకు మోసపోవద్దని, వారి మాయాజాలాన్ని తిప్పికొట్టి ఇప్పటివరకు వారు చేసిన అభివృద్ధిని నిలదీయాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బాల్సింగ్ పాల్గొన్నారు.
బొంరాస్పేట : అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడిన గిరిజన తండాల దశ దిశను సీఎం కేసీఆర్ పూర్తిగా మార్చివేశారని గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు. ఆదివారం మహారాష్ట్రలోని పుణెలో కొడంగల్ నియోజకవర్గం నుంచి వలస వెళ్లిన కూలీలతో నిర్వహించిన బంజారా ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడారు. 500 జనాభా దాటిన తండాలను గ్రామ పంచాయతీలుగా ప్రకటించి గిరిజనులకు స్వయం పాలనలో అవకాశం కల్పించామని, తండా పంచాయతీలకు నేరుగా నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు.
ప్రతి తండాకు బీటీ రోడ్డు నిర్మించామని తెలిపారు. కేసీఆర్ సీఎం అయిన తరువాత మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చి తండాల్లో మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించారని మహేందర్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వస్తే ఆసరా పింఛన్లను రూ.4000లకు పెంచుతామని, రైతు బంధు పెట్టుబడి సహాయాన్ని రూ.16 వేలకు పెంచుతామని, పేద కుటుంబాలకు రూ.15 లక్షలతో కేసీఆర్ బీమా పథకాన్ని అమలు చేస్తామని, తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని మంత్రి మహేందర్రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో కొడంగల్లో మరోసారి నరేందర్రెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు.
వచ్చే ఎన్నికల్లో కొడంగల్ నుంచి మరోసారి తనను గెలిపిస్తే తండాలను మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తరువాతనే తండాలను అభివృద్ధి చేశానని, తండాలకు బీటీ రోడ్లు, విద్యుత్ సౌకర్యం, గ్రామ పంచాయతీలకు సొంత భవనాల నిర్మాణం చేపట్టామని చెప్పారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్రెడ్డి తండాలను ఏమాత్రం పట్టించుకోలేదని ఎమ్మెల్యే విమర్శించారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా బంజారా సంఘం అధ్యక్షుడు శంకర్ పవార్, బొంరాస్పేట జడ్పీటీసీ దేశ్యానాయక్, పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, కొడంగల్ తాలూకా సేవాలాల్ సంఘం అధ్యక్షుడు దేశ్యానాయక్, బొంరాస్పేట, దుద్యాల మండలాల బీఆర్ఎస్ అధ్యక్షులు కోట్ల యాదగిరి, చాంద్పాషా, పార్టీ నాయకులు సలీం, మహేందర్రెడ్డి, మధుయాదవ్, బాల్సింగ్, నెహ్రూనాయక్ పాల్గొన్నారు.