వికారాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో మైనింగ్ లీజులతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతున్నది. పెద్ద, చిన్న తరహా గనుల ద్వారా ప్రతి ఏడాది రూ.100 కోట్లకుపైగా రెవెన్యూ ప్రభుత్వ ఖజానాకు చేరుతున్నది. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష్యానికి మించి ఆదాయం సమకూరింది. అధికారులు రూ.113.46 కోట్ల రెవెన్యూను టార్గెట్గా నిర్ణయించగా.. ఏకంగా రూ.115.04 కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పటివరకు 101.39 శాతం మేర ఆదాయం ప్రభుత్వానికి చేరింది. ఇందులో పెద్ద తరహా గనుల లీజుతో రూ.27.08 కోట్లు, చిన్న తరహా గనుల లీజుతో రూ.87.95 కోట్లు వచ్చింది.
గనుల లీజుతో ఆదాయం మైనింగ్ శాఖకు వచ్చిన ఆదాయాన్ని నెలలవారీగా పరిశీలిస్తే ఏప్రిల్లో రూ.10.68 కోట్లు, మేలో రూ.10.96 కోట్లు, జూన్లో రూ.12.76 కోట్లు, జూలైలో రూ.7.70 కోట్లు, ఆగస్టులో 9.30 కోట్లు, సెప్టెంబర్లో రూ.7.51 కోట్లు, అక్టోబర్లో రూ.8.49 కోట్లు, నవంబర్లో రూ.7.30 కోట్లు, డిసెంబర్లో రూ.8.73 కోట్లు, జనవరిలో రూ.8.93 కోట్లు, ఫిబ్రవరిలో రూ.15.47 కోట్లు, మార్చిలో ఇప్పటివరకు రూ.7.18 కోట్లుగా ఉన్నది. అయితే జిల్లాలో ఎర్రమట్టి, సుద్ద గనులు, నాపరాయి, పలుగురాయి, సెల్డ్స్పార్, కంకర, గ్రానైట్ గనుల తవ్వకాలు జరుగుతున్నాయి.
అదేవిధంగా జిల్లాలోని పెద్దేముల్, మర్పల్లి, వికారాబాద్, పరిగి మండలాల్లో 610 హెక్టార్ల విస్తీర్ణంలో 40 ఎర్రమట్టి గనులున్నాయి. అదేవిధంగా తాండూరు మండలంలో 100 హెక్టార్ల విస్తీర్ణంలో 160 నాపరాయి గనులున్నాయి. పెద్దేముల్, మర్పల్లి, ధారూర్ మండలాల్లో 41 హెక్టార్ల విస్తీర్ణంలో 65 సుద్ద, వికారాబాద్, దోమ మండలాల్లో 86 హెక్టార్లలో 34 కంకర గనులున్నాయి. తాండూరు మండలంలో 12 హెక్టార్లలో 6 గ్రానైట్ గనులుండడంతోపాటు దోమ మండలంలో 76 హెక్టార్లలో 6 పలుగురాళ్ల గనులున్నాయి.
జిల్లాలో గనుల అక్రమ తవ్వకాలతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నదనే విమర్శలున్నాయి. లీజు ఒకచోట, తవ్వకాలు మరోచోట అనే విధంగా కొంత ప్రాంతాన్ని లీజుకు తీసుకుంటున్న మైనింగ్ వ్యాపారులు లీజుకు తీసుకోని ప్రాంతాల్లో కూడా మైనింగ్ జరుపుతున్నా రెవెన్యూ అధికారులు, మైనింగ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.
ఎవరైనా ఫిర్యాదు చేస్తే, తుతూ మంత్రంగా గనులకు వెళ్లి అక్కడున్న చిన్నచిన్న యంత్రాలను సీజ్ చేసి చేతులు దులుపుకొంటున్నారనే ఆరోపణలున్నాయి. అదేవిధంగా కరెంట్ కనెక్షన్లో కూడా మోసం జరుగుతున్నది. సర్వే నెంబర్ పేరు ఒకటి ఉంటే, మరో చోట కనెక్షన్ తీసుకొని తవ్వకాలు జరుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రెవెన్యూ, విద్యుత్, మైన్స్, పోలీసు అధికారులు సంయుక్తంగా దాడులు చేస్తేగానీ అక్రమ తవ్వకాలకు అడ్డుకట్టపడే అవకాశం లేదు. అంతేకాకుండా కొన్ని మైనింగ్ సంస్థల వ్యవహారంతో జిల్లాకు రావాల్సిన రాయల్టీ విషయంలోనూ నష్టం జరుగుతున్నదనే విమర్శలున్నాయి.
ఈ ఆర్థిక సంవత్సరం ప్రభుత్వం నిర్దేశించిన టార్గెట్కు మించి ఆదాయం వచ్చింది. అదేవిధంగా అక్రమ మైనింగ్ తవ్వకాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించాం. మైనింగ్ ప్రాంతాలను తనిఖీలు చేసి అక్రమ మైనింగ్కు అడ్డుకట్ట వేస్తాం.
– సత్యనారాయణ, జిల్లా మైనింగ్ శాఖ ఏడీ