కడ్తాల్, జనవరి 6 : పాడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర విజయ డెయిరీ ఎండీ లక్ష్మిని శనివారం మండలంలోని పాల సొసైటీ అధ్యక్షులు కలిశారు. నెల రోజులుగా పాల సేకరణకు సంబంధించిన బిల్లులు రాకపోవడంతో పాడి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు నిర్ణీత సమయానికి పశువుల దాణాను అందించలేకపోతున్నారని పేర్కొన్నారు.
కడ్తాల్లోని పాలశీతలీకరణ కేంద్రం ఆవరణలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ నిరుపయోగంగా ఉన్నదని, దానిని వెంటనే ప్రారంభించి అర్హులకు దుకాణాలను కేటాయించాలని కోరారు. సమస్యల పరిష్కారానికి ఎండీ సానుకూలంగా స్పందించారని సొసైటీ సభ్యులు తెలిపారు. ఎండీని కలిసినవారిలో కడ్తాల్, కొండ్రిగానిబోడుతండా, చల్లంపల్లి, నిర్దవెళ్లి, విఠాయిపల్లి జంగారెడ్డిపల్లి గ్రామాల పాల సొసైటీ అధ్యక్షులు వెంకటేశ్, బిచ్చానాయక్, కృష్ణయ్య, రంగయ్య, శ్రీకాంత్రెడ్డి, జైపాల్రెడ్డి ఉన్నారు.