మిగ్జాం తుఫాన్ దూది రైతులను నట్టేట ముంచుతున్నది. బంగాళాఖాతంలో ఏర్పడిన సైక్లోన్ ప్రభావంతో పత్తి వర్షపునీటితో తడిసి నల్లబారుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానంగా ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో పత్తి అధికంగా పండిస్తారు. పత్తి ఏరడానికి కూలీలు దొరక్కపోవడం, కండ్లముందే పత్తి వర్షానికి తడిసి పోతుండడంతో అన్నదాతలు తల్లడిల్లిపోతున్నారు. నష్టం ఏం లేదని వ్యవసాయాధికారులు అంటున్నా.. దిగుబడి తగ్గి, సగం ధర కూడా రాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు కొన్నిచోట్ల వరి కోతలు ప్రారంభం కాగా.. మరికొన్ని చోట్ల ధాన్యాన్ని కేంద్రాలు, కల్లాలు, రోడ్ల వెంట రాసులుగా పోయడంతో వర్షార్పణమైంది. కల్లాల దగ్గర రైతులు ఆరబోసి కూర్చోవాల్సిన దుస్థితి నెలకొంది. ఒకవేళ మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే చాలా నష్టం సంభవించే అవకాశం ఉంది. ధాన్యం రైతులు ఆగమవుతుండగా.. పత్తి కర్షకులకు కన్నీరే మిగిలే అవకాశం ఉంది.
– మంచిర్యాల, డిసెంబర్ 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
నాకున్న పదెకరాల్లో పత్తి వేసిన. మొదట్లో మంచిగా వర్షాలు కురవడంతో పత్తి ఏపుగా పెరిగింది. ఆ తర్వాత రెండు నెలలు వర్షాలు పడకపోవడంతో పూత, ఖాత అనుకున్నంత రాలేదు. ఇందుకోసం చాలా ఖర్చు చేసి మందులు కొట్టిన. ఎకరానికి కనీసం పది క్వింటాళ్లు వస్తుందని ఆశపడ్డా. మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి పత్తి పూర్తిగా తడిసి నల్లబారుతోంది. భూమి మీద పడ్డ పత్తి పనికి రాదు. ఇప్పుడు మార్కెట్లో క్వింటాలుకు రూ.6,400 మాత్రమే ధర పెడుత అంటున్నరు. రంగు మారితే రూ.400 నుంచి రూ.500 వరకు తక్కువ వస్తాయి. ధర పడిపోవడంతోపాటు నేలరాలిన పత్తి అమ్మకానికి పనికిరాదు. ఎకరాకు ఏడెనిమిది క్వింటాళ్లు వచ్చినా రూ.4 వేల వరకు నష్టం వస్తది. నేలరాలిన పత్తి కనీసం రెండు క్వింటాళ్లు ఉంటది. ఇలా రైతుకు రూ.12 వేల నష్టం వస్తది. పదెకరాలకు కనీసం రూ.60 వేలు నష్ట పోతా. ఇలానే వానలు పడితే చెట్టు మీదనే మొలకలు వచ్చే ప్రమాదం ఉంది. ఇలా అయితే ఇక దూది కొనక పూర్తిగా నష్టపోత.
మంచిర్యాల, డిసెంబర్ 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మిజ్గాం తుఫాను రైతులను నిలువెల్లా ముంచింది. మూడు రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పడుతున్న అకాల వర్షాలు, ఈదురుగాలులతో కూడిన ముసురు రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. ముఖ్యంగా పత్తి రైతును వర్షం ఆగం చేసింది. మూడు రోజులుగా కురుస్తున్న తుంపర్లకు చేనులో పత్తి పూర్తిగా తడిసింది. పత్తి పువ్వు మొత్తం నీళ్లతో నిండిపోయి బరువెక్కింది. కొన్ని చోట్ల చెట్ల మీద నుంచి పత్తి రాలి పోతున్నది.
మంచిర్యాల జిల్లా నెన్నెల, వేమనపల్లి, కోటపల్లి, చెన్నూర్ రూరల్, కన్నేపల్లి, భీమిని, ఆసిఫాబాద్.. ఆదిలాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో పత్తి చేలలో ఇవే దృశ్యాలు కనిపించాయి. భారీ వర్షం కాదు పెద్ద నష్టం ఏం లేదని వ్యవసాయ అధికారులు చెప్తున్నా.. చేలలో తడిసిన పత్తి నల్లబారుతోందని దానితో దిగుబడి తగ్గి, సగం ధర కూడా రాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలకు పత్తిని ఏరించలేక, తడిసిన పత్తిని వదిలేసి వెళ్లలేక పంటను చూసి తల్లడిల్లిపోతున్నారు.
ఉమ్మడి జిల్లాలో దాదాపు 10 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. ఈ లెక్కన పత్తి సాగు చేసిన రైతులు అధికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. మరోవైపు కొనుగోలు కేంద్రాలు, కల్లాలు, రోడ్ల వెంట కోత కోసి రాసులుగా పోసిన ధాన్యం వర్షార్పణమైంది. పరదాల కింది నుంచి పోయేంత వర్షం రాకపోయినా.. కొంత వరకు ధాన్యం తడిసింది. దీంతో కల్లాల దగ్గర రైతులు ఆరబోసి కూర్చోవాల్సిన దుస్థితి వచ్చింది. ఒకవేళ మరో రెండు రోజులు ఇదే పరిస్థితి ఉంటే ఇబ్బంది పెరిగే అవకాశం ఉంది.
నెన్నెల, డిసెంబర్ 7 : మూడు రోజులుగా కురుస్తున్న వాన పత్తి పంటను బాగా దెబ్బతీసింది. నేను ఐదెకరాల భూమి కౌలుకు తీసుకొని పత్తి వేశా. ఎకరానికి రూ.12 వేలు చెల్లిస్తున్నా. పంట మంచిగానే వచ్చింది. పూత, ఖాత చెట్టు నిండా కనిపించింది. పెట్టిన పెట్టుబడి వస్తోందని నాలుగు పైసలు కష్టపడ్డందుకు మిగులుతాయనుకున్నా. ఈ వర్షం పడడంతో నాకు ఆశలు లేకుండా చేశాయి. ఎకరానికి పది నుంచి పన్నెండు క్వింటాళ్ల పత్తి వస్తుందనుకున్నా. చేతికొచ్చే సమయంలోనే వాన పడింది. పత్తి బాగా తడిసి పోయింది. మూడు రోజులుగా జల్లులు పడడంతో తడిసింది. ఎక్కడ చూసినా పత్తి తడిసి నల్లబడింది. పత్తి నల్లబడడంతో మా పని అయిపోయింది.
ఇక ధర కూడా తక్కువగా వస్తది. కొనే వారు కూడా రంగు మారిన పత్తిని బాగా తక్కవ ధరకు అడుగుతరు. ధర పడి పోతే మాకు పెట్టిన పెట్టుబడి కూడా రాదు. తడిసిన పత్తి తీసి ఆరా బెట్టే సరికి రోజులు పడుతాయి. ఇలా ఆర పెట్టిన పత్తి తూకంలో కూడా బరువు రాదు. ఎకరానికి దాదాపు రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు నష్ట పోవాల్సి వస్తుంది. ఐదెకరాలలో దాదాపు రూ.35 వేల వరకు నష్ట పోతున్న. ధర కూడా తక్కవగా అవుతుంది. లాభం రాక పోవచ్చు. ఈ వర్షం ఇంకా పడినట్లయితే చేతులు కాల్చుకున్నట్లే. తెచ్చిన అప్పులు పెరిగి పోతయ్.
– అబ్బర్ల శ్రీనివాస్, కౌలు రైతు, నెన్నెల మండలం.
కోటపల్లి, డిసెంబర్ 7 : వర్షానికి తడిసి, రంగు మారిన పత్తిని కొనుగోలు చేయాలి. వర్షానికి పత్తి తడిసిపోయి రంగు మారడం వల్ల మాకు మద్దతు ధర వచ్చేలా లేదు. పత్తి చేతికి వచ్చిన సమయంలో తుఫాను రావడం వల్ల రైతులందరూ నష్టపోవాల్సి వస్తోంది. రైతులందరికీ న్యాయం చేసేందుకు తడిసిన పత్తిని ప్రభుత్వమే కొనుగోలు చేసి మాకు న్యాయం చేయాలి.
– కొట్టె స్వామి, రైతు, కోటపల్లి