Metro Student Pass | సిటీబ్యూరో, జూలై 1(నమస్తే తెలంగాణ): విద్యార్థుల సౌకర్యార్థం హైదరాబాద్ మెట్రో రైలులో సూపర్ సేవర్ స్టూడెంట్ పాస్-2023ను జూలై 1 నుంచి అమల్లోకి తీసుకువచ్చామని మెట్రో ఎం.డి ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో అధికారులు శనివారం స్టూడెంట్ పాస్ వివరాలను వెల్లడించారు. మెట్రో ప్రయాణాన్ని మరింత మెరుగ్గా ఆస్వాదించాలని విద్యార్థులకు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. 1998 ఏప్రిల్ 1 తర్వాత పుట్టిన విద్యార్థులంతా ఈ పాస్ పొందేందుకు అర్హులని, ఈ ఆఫర్ కింద విద్యార్థులు 20 ట్రిప్పులకు మాత్రమే చెల్లించి, అన్ని ఫేర్ జోన్లలో 30 ట్రిప్పుల వరకు ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. కాగా, విద్యా్థలు తప్పనిసరిగా బ్రాండెడ్ స్మార్ట్ కార్డు కొనుగోలు చేయాలన్నారు. ఒక విద్యార్థికి ఒక స్మార్ట్ కార్డ్ మాత్రమే జారీ చేస్తారని, అది కొనుగోలు చేసిన తేదీ నుంచి 30 రోజుల వరకు చెల్లుబాటు అవుతుందని ఎల్ అండ్ టీ మెట్రో ఎం.డి కేవీబీ రెడ్డి తెలిపారు.
ఈ ఆఫర్ జూలై 1 నుంచి ప్రారంభమై వచ్చే ఏడాది (2024) మార్చి వరకు 9 నెలలు మాత్రమే అందుబాటులో ఉంటుందన్నారు. విద్యార్థులు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య పలు మెట్రో స్టేషన్లలో పాస్లను కొనుగోలు చేయాలని సూచించారు. ఈ జాబితాలో రెడ్ లైన్లో జేఎన్టీయూ కాలేజ్, ఎస్ఆర్నగర్, అమీర్పేట, విక్టోరియా మెమోరియల్, దిల్సుఖ్నగర్, గ్రీన్ లైన్లో నారాయణగూడ, బ్లూ లైన్లో నాగోల్, పరేడ్ గ్రౌండ్, బేగంపేట, అమీర్పేట, రాయదుర్గం మెట్రో స్టేషన్లలో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సూపర్ సేవర్ మెట్రో పాస్లను కొనుగోలు చేసిన విద్యార్థులకు హైదరాబాద్ మెట్రో రైలుతో అనుసంధానం గల రిలయన్స్ ట్రెండ్స్, 24 సెవన్స్ కన్వీనియన్స్ స్టోర్ వంటి వాణిజ్య సంస్థల ద్వారా రాయితీ కూపన్లు పొందవచ్చని, మరిన్ని వివరాలకు (www.ltmetro.com) మెట్రో వెబ్సైట్లో సంప్రదించాలని కేవీబీ రెడ్డి తెలిపారు.