పరిగి టౌన్, డిసెంబర్ 9 : మతిస్థిమితం సరిగ్గా లేని ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో దారుణంగా హత్య చేసి ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పరిగి పోలీస్స్టేషన్ పరిధిలోని సుల్తాన్పూర్ గ్రామం లో శుక్రవారం జరిగింది. ఎస్ఐ విఠల్రెడ్డి కథ నం ప్రకారం… గ్రామానికి చెందిన కావలి భీమ య్య (52)కు కొన్ని రోజులుగా మతిస్థిమితం సరిగ్గా లేదు. కాగా గురువారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న భార్య పెంటమ్మ (49)ను ఎవ్వరూ లేని సమయంలో గొడ్డలితో తలపై కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం భీమయ్య కూడ ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
శుక్రవారం ఉదయం పెంటమ్మను కూలీ పని నిమిత్తం పిలిచేందుకు గ్రామానికి చెందిన శశికళ అనే మహిళ ఇంటికి వచ్చి పిలువగా తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె ఈ విషయాన్ని గ్రామస్తులకు చెప్పడంతో వారు వచ్చి తలుపులు పగు లగొట్టి చూసేసరికి భార్యాభర్తలు ఇద్దరూ మృతి చెంది పడి ఉన్నారు. మానసిక స్థితి సరిగ్గా లేకనే తండ్రి భీమయ్య, తల్లిని చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుల కుమార్తె కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కాగా ఘటనాస్థలిని డీఎస్పీ కరుణసాగర్రెడ్డి పరిశీలించి హత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.