వికారాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): జిల్లాలోని నిరుద్యోగులకు శుభవార్త. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా టీఎస్ఎస్టీఈపీ (తెలంగాణ రాష్ట్ర శిక్షణ, ఉపాధి సొసైటీ) ఆధ్వర్యంలో శనివారం మెగా జాబ్మేళాను నిర్వహిస్తున్నారు. 60 కంపెనీలు పాల్గొని దాదాపుగా ఏడు వేల మందికి ఉపాధి కల్పించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వికారాబాద్ పట్టణంలోని నర్సింగ్ ఫంక్షన్ హాల్లో ఉదయం 10 గంటల నుంచి జరుగనున్న జాబ్మేళాను మంత్రులు శ్రీనివాస్గౌడ్, పి.సబితాఇంద్రారెడ్డి ప్రారంభించనున్నారు.
పదో తరగతి పాస్ లేదా ఫెయిల్ మొదలుకొని పీజీ వరకు, ఇంజినీరింగ్, ఐటీఐ, పాలిటెక్నిక్, ఎంబీఏ, ఫార్మసీ, హోటల్ మేనేజ్మెంట్ విద్యార్హత ఉన్న వారు జాబ్మేళాలో పాల్గొనేందుకు అర్హులని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి హన్మంత్రావు తెలిపారు. ఇంటర్వ్యూలకు హాజరయ్యే నిరుద్యోగులు తమ వెంట ఐదు కాపీల బయోడేటాతోపాటు ఆధార్ కార్డు జిరాక్స్తో హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 63042 50542, 99599 03463 నంబర్ను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.