పరిగి, మార్చి 26 : మిడిమిడి జ్ఞానంతో వచ్చిరాని వైద్యం చేస్తూ ఆర్ఎంపీలు పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పేరుకు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ల బోర్డులు పెడుతూ అన్ని రోగాలకు చికిత్స అందిస్తూ ప్రజల ప్రాణాలను హరిస్తున్నారు. పరిగిలో కొంతకాలంగా ఆర్ఎంపీల ఆగడాలు మితిమీరుతున్నాయి. వారి వైద్యానికి పలువురు బలవుతున్నా పట్టించుకునే నాథుడేలేడు. జిల్లా స్థాయిలో ఉండే ఉన్నతాధికారుల నిర్లక్ష్యం, అవినీతి వల్లనే ఆర్ఎంపీల ఆకృత్యాలకు అడ్డుకట్ట పడడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
దోమ మండలం ఊట్పల్లి గ్రామానికి చెందిన బంటు శ్రీనివాస్ మృతికి పరిగికి చెందిన ఆర్ఎంపీ గఫార్ కారణమని, చర్యలు తీసుకోవాలని పలువురు జిల్లా వైద్యాధికారి పల్వన్కుమార్కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ నెల 22వ తేదీన డిప్యూటీ డీఎంఅండ్హెచ్వోలు డాక్టర్లు జీవరాజ్, రవీంద్ర, డిప్యూటీ డెమో శ్రీనివాస్లు విచారణ చేపట్టారు. యాసిన్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ను నిర్వహిస్తున్న ఎండీ గఫార్కు క్లినిక్ నిర్వహణ, అల్లోపతి వైద్యం చేయడానికి ఎలాంటి అర్హతలు, అనుమతులు లేవని నిర్ధ్దారించి ఆ సెంటర్ను సీజ్ చేశారు. ఈ మేరకు విచారణ నివేదికను డైరెక్టర్ ఆఫ్ హెల్త్, జిల్లా కలెక్టర్కు సమర్పిస్తామని అధికారులు తెలిపారు. ఇక్కడివరకు అంతాబాగానే ఉన్నా గఫార్ లాంటి వారు మరేందరో యథేచ్ఛగా ఫస్ట్ ఎయిడ్ సెంటర్లలో వైద్యం చేస్తుండడం గమనార్హం.
ఆర్ఎంపీలకు అల్లోపతి వైద్యం చేసే అర్హత ఉండదు. వారు కేవలం ప్రాథమిక చికిత్సను అందించాల్సి ఉంటుంది. కానీ గతంలో ఆర్ఎంపీలు ఏకంగా డాక్టర్లమంటూ బోర్డులు వేలాడదీసుకొని ప్రజలకు చికిత్స అందించేవారు. దీన్ని గమనించిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ జోక్యంతో వాటి స్థానంలో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ల బోర్డులు ఏర్పాటు చేసుకున్నారు. కానీ నేడు తెలిసితెలియని జ్ఞానంతో అన్ని రోగాలకూ వైద్యమందిస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు.
ప్రైవేటు క్లినిక్ల్లో ఎంబీబీఎస్ డాక్టర్లు వైద్యం కోసం రూ.150 వరకు తీసుకుంటుండగా.. ఆర్ఎంపీలు రూ.100 వసూలు చేస్తూ ప్రజలను తమవైపు తిప్పుకొంటున్నారు. అవసరం లేకున్నా మందులు రాస్తూ, ఇంజెక్షన్లు ఇస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఆర్ఎంపీలు అసలు ఇంజెక్షన్ సైతం ఇవ్వకూడదని అధికారులు పేర్కొంటుంటే.. పరిగిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉన్నది. కొందరు ఆర్ఎంపీలు చిన్నపాటి రోగానికే స్లైన్లు సైతం ఎక్కిస్తూ అమాయక ప్రజల నుంచి అందినకాడికి దండుకుంటున్నారు.
మందులు హై డోస్ ఇచ్చి త్వరగా జబ్బు నయమయ్యేలా చూడడం వల్ల ప్రజల సైతం ఎంబీబీఎస్ డాక్టర్ల కంటే ఆర్ఎంపీల వద్దకే అధికంగా వెళ్తున్నారు. వాస్తవానికి వైద్యశాస్త్రం ప్రకారం తక్కువ డోసు మొదలుకొని వ్యాధి తగ్గని పరిస్థితిలో అధిక డోసు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఆర్ఎంపీలు ఇదేమీ పట్టించుకోకుండా ధనార్జనే ధ్యేయంగా అధిక డోసులిస్తున్నారు. దీంతో మరోసారి వైద్యం అవసరమైతే అంతకంటే ఎక్కువ డోసు ఇస్తే తప్ప ప్రజలకు రోగం నయం కాని దుస్థితి ఏర్పడుతున్నది. అధిక డోసు ఇవ్వడం హానికరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నా ఆర్ఎంపీలు పెడచెవిన పెడుతున్నారు.
పరిగిలోని పలువురు ఆర్ఎంపీలు వైద్యం చేయడం ద్వారా వచ్చే ఆదాయం సరిపోదన్నట్లు కొందరు తమ బంధువుల పేరిట మెడికల్ షాపులు ఏర్పాటు చేసి ప్రతి చిన్న రోగానికీ అధిక మొత్తంలో మందులు రాసి రోగుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. ఆర్ఎంపీలు అసలు ప్రిస్క్రిప్షన్లు రాయొద్దనే నిబంధనలు ఉండడంతో.. వారు రాసే ప్రిస్క్రిప్షన్ బయటకు పోనివ్వకుండా ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పక్కనే తమవారు ఏర్పాటు చేసిన మెడికల్ షాపులోనే మందులు కొనుగోలు చేయాలని రోగులకు సూచిస్తున్నారు. ఎవరైనా ఇతర మెడికల్ షాపులకు వెళ్తే ఈ మందులు కావంటూ వాటిని తిప్పి పంపిస్తుండడం గమనార్హం. ఇప్పటికైనా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు స్పందించి ఆర్ఎంపీల ఆగడాలకు అడ్డుకట్ట పడేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.