షాబాద్, జనవరి 10 : ప్రభుత్వ దవాఖానల్లో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు చేపడుతున్నట్లు రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్రావు అన్నారు. షాబాద్లోని ప్రభుత్వ దవాఖానను ఆమెజాన్ వెబ్ సర్వీస్ ఆధ్వర్యంలో పునరుద్ధరించిన ఆరోగ్యకేంద్రాన్ని ఆమెజాన్ వెబ్ సర్వీస్ వైస్ ప్రెసిడెంట్ కెవిన్ మిల్లర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ దవాఖానను అభివృద్ధి చేసేందుకు ఆమెజాన్ వెబ్ సర్వీస్ ముందుకు రావడం గొప్ప పరిణామమన్నారు.
ఇప్పటికే చందనవెళ్లి దవాఖానను అభివృద్ధి చేశారని, షాబాద్ దవాఖానను కూడా పునరుద్ధరించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేలా తాము చర్యలు తీసుకుంటున్నామన్పారు. షాబాద్ దవాఖానలో 24 గంటలు పాటు వైద్యసేవలు అందించేలా చూడాలని సర్పంచ్తో పాటు ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చారని, త్వరలో అ సమస్య పరిష్కరానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు.
అమెజాన్ వెబ్ సర్వీస్ వైస్ ప్రెసిడెంట్ కెవిన్ మిల్లర్ మాట్లాడుతూ.. కమ్యూనిటీలపై సానుకూల ప్రభావం చూపడమే తాము లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రంగారెడ్డిజిల్లాలోని నెదునూర్, మీర్ఖాన్పేట్, కందుకూరు, షాబాద్ తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల పునరుద్ధరణ చేపట్టామన్నారు. ఆరోగ్య సంరక్షణ కేంద్రం పునరుద్ధరణలో భాగంగా గదులన్నీ పూర్తిగా మార్చడంతో పాటు వెయిటింగ్ హాల్, మరుగుదొడ్లు, ఆరోగ్యకేంద్రానికి ఆనుకున్న స్థలంలో పార్కింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భవనం దెబ్బతినకుండా వాటర్ ప్రూఫింగ్ చేశామన్నారు.
కొత్త ఫర్నిచర్ అందించినట్లు చెప్పారు. అమెజాన్ వెబ్ సర్వీస్ ఇండియా సెర్చ్ సపోర్ట్తో ఈ కేంద్రం పునరుద్ధరణ పనులు చేపట్టినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ దామోదర్, షాబాద్ ఎంపీపీ కోట్ల ప్రశాంతిరెడ్డి, షాబాద్ సర్పంచ్ తమ్మలి సుబ్రమణ్యేశ్వరి, ఎంపీడీవో అనురాధ, సీహెచ్వో గోపాల్రెడ్డి, డాక్టర్ శ్రీనివాస్, సర్పంచులు కొలన్ ప్రభాకర్రెడ్డి, మహేందర్రెడ్డి, చందిప్ప జంగయ్య, వెంకటేశ్, రవీందర్, ఎంపీటీసీలు అశోక్, కుమ్మరి చెన్నయ్య, అస్మత్పాషా, ఫార్మసిస్ట్ శంకర్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.