కుత్బుల్లాపూర్, నవంబర్ 5 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఓటరు జాబితా ముసాయిదాపై విడుదలైన నోటిఫికేషన్పై శుక్రవారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో అఖిలపక్ష నాయకుల అభిప్రాయ సేకరణ చేపట్టారు. జంట సర్కిళ్ల ఉప కమిషనర్లు మంగతాయారు, ప్రశాంతితో పాటు కుత్బుల్లాపూర్ మండల తాసీల్దార్ వినయ్, సిబ్బందితో కలిసి అభిప్రాయాలను సేకరించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో దుండిగల్, బాచుపల్లి, కుత్బుల్లాపూర్ రెవెన్యూ మండలాల పరిధిలో మొత్తం 6,26,238 మంది ఓటర్లు నమోదయ్యారని అధికారులు తెలిపారు. వీరిలో పురుషులు 3,30,250 మంది కాగా మహిళలు 2,95,884 మంది, 98 మంది ఇతరులు ఉండగా 549 పోలీంగ్ కేంద్రాలు గుర్తించబడ్డాయని తెలిపారు. వీటిలో గాజులరామారం సర్కిల్ పరిధిలో 219, కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో 173, బాచుపల్లి మండలంలో 93, దుండిగల్ మండలంలో 64 పోలింగ్ కేంద్రాలు ఉండగా, ప్రతి పోలింగ్ కేంద్రంలో 1500 మంది ఓటర్లు మించకుండా విడుదల చేసిన ముసాయిదాను వివరించారు.
నియోజకవర్గం పరిధిలో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుందని, దీనికి తోడు కొంతమంది మరణించిన వారి పేర్లు తొలగించకుండానే ఫైనల్ లిస్టు చేస్తున్న ఘటనలు తలెత్తాయని, ఈ దఫా అలాంటి వాటికి తావివ్వకుండా సమగ్ర ఓటరు సర్వే ద్వారా అర్హులైన వారందరికి ఓటు హక్కు కల్పించాలని నేతలు సూచించారు. దీనికి తోడు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి నూతన ఓటు హక్కును కల్పించాలని, సమీపంలోనే పోలింగ్ కేంద్రం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం విడుదలైన ముసాయిదా జాబితాలో అనేక మార్పులు, చేర్పులు చేయాలని ఆయా పార్టీలకు చెందిన నేతలు సూచించడంతో వారి అభిప్రాయాన్ని సేకరించిన అధికారులు పైస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఓటరు సవరణ చేపట్టేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు కొత్త ఓటర్ నమోదుకు ఈ నెల 30 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు.