శామీర్పేట : ప్రభుత్వం సృష్టించిన సంపదను పేద ప్రజలకు పంచడమే ప్రభుత్వ లక్ష్యమని, అది ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ఒక్కరికే సాధ్యమని రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి (Minister Malla reddy) అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శామీర్పేట మండలం అలియాబాద్, లాల్గడి మలక్పేట, మజీద్పూర్, యాడారం, బాబాగూడ, పొన్నాల్, తుర్కపల్లి, మురహార్పల్లి, మూడుచింతలపల్లి లోని కొల్తూర్ గ్రామాల్లో బుధవారం రోడ్ షో(Road Show) నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం, ఏ పార్టీ చేయని విధంగా ఆసరా పింఛన్ మొదలుకుని కల్యాణలక్ష్మి (Kalyana Laxmi), ఇంటింటికి తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా, రైతుబంధు, రైతుబీమా(Raitu Bandu), దళితబంధు, బీసీబంధు వంటి మహాత్తర పథకాలు అమలవుతున్నాయని ఆయన వెల్లడించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజలకు చేసిందేమి లేదని ఎద్దేవా చేశారు.
ఒకడు మూడు గంటల కరెంటు ఇస్తానని రైతాంగాన్ని దెబ్బతీసే పనిలో ఉంటే, మరొకరు సిలిండర్ ధరను రూ.1200లకు పెంచి పొయ్యిమీద కుండెక్కకుండా చేశారని విమర్శించారు. ఎన్నికల తర్వాత రూ.400లకు సిలిండర్ను తెలంగాణ ప్రభుత్వం అందజేయనుందన్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు రూ.3 వేలు, ఆసరా పింఛన్ నెలకు రూ.2 వేల నుంచి రూ.5 వేలకు పెంచనున్నట్లు వివరించారు. ప్రజా సంక్షేమం కోసం పని చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని గుర్తించి బీఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.