మేడ్చల్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): దేవాదాయ భూముల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఆక్రమణలకు గురైన వాటిని గుర్తిస్తూ స్వాధీనం చేసుకుంటున్నది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లోని దేవాలయ భూములపై ఇటీవలే సర్వే నిర్వహించిన అధికారులు సర్వే నంబర్ల ఆధారంగా జియో ట్యాగింగ్ చేసి ఆన్లైన్లో నమోదు చేశారు. ఆక్రమణలకు గురైన మరికొన్ని భూములపై దేవాదాయ శాఖ చట్టం 83 ప్రకారం కోర్టుల్లో కేసులు వేసి వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంటున్నారు.
రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలకు సంబంధించి మొత్తం 16170.30 ఎకరాల దేవాదాయ భూములుంటే అందులో 5461 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు దేవాదాయ శాఖాధికారులు 750కి పైగా కేసులు వేసి 2357 ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు. మరో 3103 ఎకరాలపై యథాతధంగా కేసులు నడుస్తున్నట్లు అధికారులు వివరించారు.
హైదరాబాద్ జిల్లాకు చెందిన దేవాదాయ భూములు నల్లగొండ జిల్లా వడ్డెపల్లిలో 354 ఎకరాలుండగా ఆక్రమణకు గురయ్యాయి. ఇది గమనించిన అధికారులు పట్టాలను రద్దు చేయించడంతో పాటు రైతుబంధును నిలిపేసి ఆ భూములను ప్రభుత్వ పరం చేశారు.
హైదరాబాద్ జిల్లాలో మొత్తం 5088.20 ఎకరాల దేవాదాయ భూములుంటే ఇందులో మహారాష్ట్రలో 2500 ఎకరాలు ఉన్నాయి. ఈ భూములు ఎలాంటి ఆక్రమణలకు గురికాలేదని అధికారులు వివరించారు. సికింద్రాబాద్ పరిధిలో 137.34 ఎకరాలుంటే అవి కూడా దేవాదాయ శాఖ ఆధీనంలోనే ఉన్నాయి.
సమైక్య పాలనలోనే దేవాదాయ శాఖ భూములు ఆక్రమణలకు గురయ్యాయి. అయితే స్వరాష్ట్ర సాధన తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే దేవాదాయ భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆక్రమణలకు గురైన భూములను స్వాధీనం చేసుకుంటున్నది. త్వరలోనే ఈ ఆక్రమణలన్నింటికీ ఫుల్స్టాప్ పెట్టేలా ప్రత్యేక చర్యలు చేపట్టింది.