దుండిగల్, మే 6: కొందరు అక్రమార్కులు పట్టా భూమి పేరుతో చెరువునే స్వాహా చేస్తున్నారు. ఏకంగా చెరువు మధ్యలోనే ఫెన్సింగ్ వేసి, పశువుల కొట్టాల పేరుతో ప్రభుత్వ భూమిలో షెడ్లు నిర్మించి అధికారులకు సవాలు విసురుతున్నారు. రెవెన్యూ అధికారులు మాత్రం విషయాన్ని ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లామని వారు ఇచ్చే నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పడం గమనార్హం.
వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం సూరారంలోని సర్వే నెంబర్ 182లో గ్రామానికి చెందిన కొందరికి సుమారు రెండున్నర ఎకరాల పట్టా భూమి ఉంది. దీని పక్కనే సర్వే నెంబర్ 190, 183లో ప్రభుత్వ భూములు ఉన్నాయి. 183 లోనే 10 ఎకరాల పైచిలుకు విస్తీర్ణంలో మహబూబ్ కుంట (చెరువు)విస్తరించి ఉంది. ఇప్పటికే అక్రమణకు గురైన మహబూబ్ కుంట కుచించుకుపోగా మిగిలిన స్థలంలో స్వాహా చేసేందుకు పక్కా ప్రణాళిక రూపొందించి ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో చెరువులోని భూమి తమ పట్టా భూమిలోకి వస్తుందంటూ ఏకంగా చెరువులోనే ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇంతటితో ఆగకుండా పశువుల కొట్టాల పేరుతో సర్వే నెంబర్ 190, ప్రభుత్వ భూమిలో పెద్ద పెద్ద షెడ్లనే ఏర్పాటు చేశారు. ఇదంతా రెవెన్యూ అధికారులకు తెలిసినప్పటికీ మౌనంగా ఉంటున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
స్థానికులు మాత్రం చెరువును రక్షించడంతోపాటు ఎఫ్టీఎల్ పరిధిలో ఏర్పాటుచేసిన ఫెన్సింగ్ తొలగించి నిర్మాణదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గతంలో జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం సర్వే చేసి ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవెల్) హద్దు రాళ్లు సైతం ఏర్పాటు చేశారని , అయినప్పటికీ హద్దు రాళ్లను తొలగించి నిర్మాణాలు చేపట్టడం వెనుక అధికారుల సహకారం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరు ఇలాగే ఉంటే భవిష్యత్తులో మహబూబ్ కుంట కనుమరుగయ్యే ప్రమాదం లేకపోలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల క్రితమే చెరువు అన్యాక్రాంతం విషయమై ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకపోగా, ఇరిగేషన్ నివేదిక పేరుతో కాలయాపన చేయడం దేనికి నిదర్శనమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అక్రమార్కులతో అధికారులు చేయి కలపడంతోనే దాటవేత ధోరణి అవలంబిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై కుత్బుల్లాపూర్ డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జున్ను వివరణ కోరగా.. సూరారంలోని మహబూబ్ కుంటలో ఫెన్సింగ్ వేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయయని చెప్పారు. చెరువు ఎఫ్టీఎల్ నిర్ధారణ కోసం నీటిపారుదల శాఖ అధికారులకు సమాచారం అందించామని, వారు నివేదిక ఇవ్వగానే చర్యలు తీసుకుంటామని పేర్కొంటున్నారు. ఎఫ్ టి ఎల్ నిర్ధారణ కోసం నీటిపారుదల శాఖ అధికారులకు సమాచారం అందించామని, వారు నివేదిక అందించగానే చర్యలు తీసుకుంటామని పేర్కొంటున్నారు.