మేడ్చల్, నవంబర్7 (నమస్తే తెలంగాణ): మినీ డెయిరీల ఏర్పాటుకు ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడిపై రుణాలు అందించే ప్రణాళిక సిద్ధమైంది. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా మొదటి దశలో వంద యూనిట్లకు గాను ప్రభుత్వం రూ. 2 కోట్లు మంజూరు చేసింది. మినీ డైయిరీలను ఏర్పాటు చేసుకునేందుకు అర్హులైన దళితులను ఎంపిక చేసి, సబ్సిడిపై ఎస్సీ కార్పొరేషన్ రుణాలు అందించనున్నది.
దళితులను ఆర్థికంగా పరిపుష్టి చేసేందుకు అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుంది. ప్రస్తుత మార్కెట్లో పాల ఉత్పత్తులకు ఉన్న డిమాండ్కు అనుగుణంగా మినీ డెయిరీల ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. మినీ డెయిరీల ఏర్పాటుకు ఒక్క యూనిట్కు రూ. 2 లక్షల ఖర్చుకాగా, ఇందులో రూ.లక్షా 60 వేలు ప్రభుత్వం అందించనుంది. మిగతా రూ. 40 వేలు మినీ డెయిరీ ఏర్పాటు అర్హత పొందిన దళిత రైతు చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తుదారుడి పేరిట 20 గుంటల స్థలం, ఆధార్కార్డు, పాన్కార్డు, పట్టాదారు పాసు పుస్తకం, కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలని, 21 వయస్సు నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నవారు అర్హులని అధికారులు తెలిపారు. వంద యూనిట్ల మినీ డెయిరీల ఏర్పాటుకు త్వరలోనే లబ్ధిదారులను ఎంపిక చేయనున్నామన్నారు.
మినీ డెయిరీల ఏర్పాటుతోపాటు పాలు కొనుగోలుకు సొసైటీలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించనుంది. మినీ డెయిరీల ద్వారా వచ్చిన పాలను సొసైటీలు కొనుగోలు చేసి, పాల ద్వారా వచ్చే ఆదాయాన్ని యూనిట్లు ఏర్పాటు చేసుకున్నవారికి సొసైటీలు అందించే విధంగా రూపొందించిన ప్రణాళికలను అమలు చేయనున్నారు. సబ్సిడి పోను డెయిరీ ఏర్పాటుకు రుణం పొందిన రూ. 40 వేలను పాల ద్వారా వచ్చిన ఆదాయం నుంచి చెల్లించే విధంగా చర్యలు తీసుకోనున్నారు. రుణాల చెల్లింపులలో సొసైటీలను బాధ్యులు చేయనున్నారు. జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ కింద మినీ డెయిరీల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో దళిత రైతులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.