Shamirpet Elevated Corridor | మేడ్చల్, మే19(నమస్తే తెలంగాణ): ప్యారడైజ్ నుంచి శామీర్పేట్ రింగ్ రోడ్డు వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించి ఇప్పట్లో పనులు ప్రారంభం కష్టంగానే కనిపిస్తుంది. ప్యారడైజ్ నుంచి శామీర్పేట రింగ్ రోడ్డు వరకు 18 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించి భూ సేకరణ పక్రియ ఇంకా కొలిక్కి రావడం లేదు. దీంతో భూ సేకరణ పక్రియ పూర్తయ్యేదేప్పుడు పనులు ప్రారంభయయ్యేదేప్పుడు అన్న సందేహలు వ్యక్తం అవుతున్నాయి.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్పేట రింగ్రోడ్డు నుంచి లోతుకుంట వరకు 12 కిలోమీటర్లు కాగా హైదరాబాద్ జిల్లాలోని లోతుకుంట నుంచి ప్యారడైజ్ వరకు 6 కిలో మీటర్లు ఉంది. ఈ ఆరు కిలోమీటర్లకు సంబంధించి రోడ్డు విస్తరణలో ఆస్తులు కోల్పోతున్న వారు పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించారు. దీంతో భూసేకరణ ప్రక్రియ ముందుకు వెళ్లడం లేదు. దీంతో ఎలివేటెడ్ కారిడార్ పనుల ప్రారంభంపై నీలి నీడలు కమ్ముకున్నాయి.
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించి 200 ఫీట్ల విస్తరణ అవసరం లేదని, 100 ఫీట్ల విస్తరణతో ఎలాంటి ఆస్తులు కోల్పోయే అవసరం రానందున వంద ఫీట్లతోనే రోడ్డు విస్తరణనే చేయాలని ఆస్తులు కోల్పోతున్న బాధితులు గ్రామ సభలలో ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. ఒకవేళ తమ భూములు తీసుకుంటే బహిరంగ మార్కెట్లో ఉన్న ధర ప్రకారం తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ డిమాండ్లను ప్రభుత్వానికి విన్నవిస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ ఇప్పటివరకు భూ సేకరణ పక్రియపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదని బాధితులు పేర్కోంటున్నారు. దీంతో ఇప్పట్లో భూ సేకరణ పక్రియ తెలేలా కనిపించడం లేదని తెలుస్తుంది.