కుత్బుల్లాపూర్,ఆగస్టు4: అన్నికులాలకు, మతాలకు అతీతంగా సీఎం కేసీఆర్ తమ పరిపాలనను ముందుకు సాగిస్తున్నాడని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. బుధవారం చింతల్ క్యాంపు కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఆలయాల నిర్వాహకులకు బోనాల ఉత్సవ ఖర్చుల కోసం ప్రభుత్వం నుంచి విడుదలైన రూ.8.55 లక్షల విలువ గల చెక్కులను ఉత్సవ కమిటీ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సారథ్యంలో అన్ని కులాలకు, మతాలకు పెద్దపీట వేస్తూ పేద, మధ్యతరగతి అనే తారతమ్యం లేకుండా ప్రజలంతా సుఖఃసంతోషాలతో పండుగలను జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వమే అన్ని ఖర్చులను వెచ్చించి అధికారికంగా నిర్వహిస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కేఎం గౌరీశ్, సురేశ్రెడ్డి, చింతల్ డివిజన్ అధ్యక్షుడు మహ్మద్ రఫీ, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జయరామ్, ఈఓ కృష్ణమాచార్యతో పాటు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.