శామీర్పేట : ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి (Minister Mallareddy) అన్నారు. తూంకుంట మున్సిపాలిటీలో రూ.4 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులకు గురువారం ఆయన భూమి పూజ చేశారు. తూంకుంట, హకీంపేట, దేవరయాంజాల్ ప్రాంతాల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేసీఆర్ దేశానికే ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు ఆకర్శితులై బీఆర్ఎస్ (BRS)లోకి చేరుతున్నారని వెల్లడించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలని కోరారు. మరోసారి పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరింత చురుకుగా అమలవుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి చామకూర మహేందర్రెడ్డి, తూంకుంట మున్సిపాలిటీ చైర్మన్ కారంగుల రాజేశ్వర్రావు, వైస్ చైర్మన్ వాణివీరారెడ్డి, కమిషనర్ జేతూరామ్నాయక్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
బీజేపీ, కాంగ్రెస్లకు డిపాజిట్లు గల్లంతు
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్లు గల్లంతేనని మంత్రి మల్లారెడ్డి అన్నారు. హకీంపేట ఫేజ్-2లో కాలనీ అధ్యక్షురాలు అమృతరెడ్డి ఆధ్వర్యంలో మల్లేశ్వరి, పావణి, సుధామహి, యాదయ్య, శ్రీకాంత్, కిరణ్లతో పాటు వంద మంది బీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి మల్లారెడ్డి బీఆర్ఎస్ కండువాకప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆదకర్శితులై ఇతర పార్టీల నుంచి భారీగా వలసలు మొదలయ్యాయన్నారు. సింగల్ డిజిట్లకే పరిమితమైన బీజేపీ, కాంగ్రెస్లకు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతు అవుతాయన్నారు.