మేడ్చల్ : ప్రజల బాగోగులు పట్టించుకోని కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy) అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడ్చల్ మండలం గౌడవెల్లి, రాయిలాపూర్, శ్రీరంగవరం, డబిల్పూర్ గ్రామాల్లో ఆదివారం ర్యాలీ, కార్నర్ మీటింగ్లు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచిన ఘనత సీఎం కేసీఆర్(CM KCR) కే దక్కుతుందని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం చేతల ప్రభుత్వమని, ఇచ్చిన మాటను నిలబెట్టుకునే పార్టీ అని అన్నారు. ఓట్లు దండుకోవడానికి వస్తున్న కాంగ్రెస్ నాయకుల(Congress Leaders) మాటలు నమ్మి మోసపోవద్దని గ్రామస్థులకు విన్నవించారు. విలువైన ఓటును కాంగ్రెస్కు వేస్తే మోర్లె వేసినట్టేనని తెలిపారు. తెలంగాణ అభివృద్ది బీఆర్ఎస్తోనే సాధ్యమని, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక గ్యాస్ సిలిండర్(Gas cylinder) ను రూ.400 లకు, పింఛన్లు రూ. 2వేలు నుంచి రూ. 5వేల వరకు అందించనుందని ఆయన వెల్లడించారు.
రైతు బంధును రూ. 15 వేల వరకు పెంచుతుందని అన్నారు. ఐదేండ్ల క్రితం ఎమ్మెల్యేగా గెలిపించినందుకు శక్తివంచన లేకుండా మేడ్చల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేశానని అన్నారు. ఈ కార్యక్రమం లో ఎంపీపీ రజితా రాజమల్లారెడ్డి, జడ్పీటీసీ శైలజా విజయనందరెడ్డి, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు నందారెడ్డి, జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు విజయనందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.