కీసర, సెప్టెంబర్ 20: కీసరగుట్ట దేవస్థానం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పూనుకుందని, రానున్న రోజుల్లో కీసర గొప్ప పర్యాటక కేంద్రంగా విరాజిల్లడం ఖాయం అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. కీసరగుట్ట ఆలయానికి ఎండోమెంట్ విభాగం వారు 12 మంది ట్రస్టు బోర్డు కమిటీ సభ్యులను నియమించింది. ఆలయ ప్రాంగణంలో కొత్తగా నియమించబడ్డ ట్రస్టుబోర్డు కమిటీ సభ్యులు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రమాణ స్వీకారం చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరానికి అతి చేరువలో ఉన్న కీసరగుట్ట ఆలయం తెలంగాణ ప్రభుత్వ హయాంలో దినదినాభివృద్ధి చెందుతుందని, కీసరగుట్ట ఆలయ అభివృద్ధి కోసం రూ.60 కోట్లతో అభివృద్ధి చేయడానికి సీఎం కేసీఆర్ కార్యాచరణ రూపొందించారన్నారు.
రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ కీసరగుట్ట ఆటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకొని గుట్ట రూపురేఖలు పూర్తిగా మార్చివేశారన్నారు.కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ బెస్త వెంకటేశ్, కీసర ఎంపీపీ మల్లారపు ఇందిరా లక్ష్మీ నారాయణ, కీసరగుట్ట ఆలయ చైర్మన్ తటాకం నాగలింగం శర్మ, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు జలాల్పురం సుధాకర్రెడ్డి, టీఆర్ఎస్ నేతలు నాయకపు వెంకటేశ్ ముదిరాజ్, రామిడి ప్రభాకర్రెడ్డి, తటాకం నారాయణ శర్మ, గుర్రం మల్లారెడ్డి, బి.రమేశ్ గుప్త, తేళ్ల శ్రీధర్, సింగారం నారాయణ, పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నేతలు తదితరులు పాల్గొన్నారు. కీసరగుట్ట శ్రీ భవాని రామలింగేశ్వరస్వామి ఆలయంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు.