పీర్జాదిగూడ, ఏప్రిల్ 9 : బోడుప్పల్ నగరపాలక సంస్థ అభివృద్ధిలో ముందుకు సాగుతున్నదని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలోని చెంగిచర్ల మొదటి డివిజన్ క్రాంతికాలనీలో రూ.కోటి 30 లక్షలతో చేపడుతున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులను మేయర్ సామల బుచ్చిరెడ్డి, స్థానిక కార్పొరేటర్ బింగి జంగయ్య యాదవ్తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్, కార్పొరేషన్లలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తూ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధికి అధిక నిధులను కేటాయిస్తున్నారన్నారు.
నగరపాలక సంస్థలో ప్రతి డివిజన్ అభివృద్ధికి బడ్జెట్లో రూ.84 కోట్ల నిధులు కేటాయించారన్నారు. స్థానిక శివధుర్గ కాలనీలో త్వరలో ఇంటింటికీ తాగు నీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రానున్న వర్షాకాలంలో ఎలాంటి విపత్తు తలెత్తినా ముంపుప్రాంతాలు నీటమునగకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నదన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కొత్తలక్ష్మీగౌడ్, కమిషన్ బోనగిరి శ్రీనివాస్, కార్పొరేటర్లు పద్మారెడ్డి, చీరాల నర్సింహ, నాయకులు జయరాములు, వెంకటేశ్ యాదవ్, పులగండ్ల జంగారెడ్డి, చక్రపాణిగౌడ్, శేఖర్రెడ్డి, బింగి యోగేశ్యాదవ్, బబ్బి, కాలనీ ప్రతినిధిలు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.