శామీర్పేట, నవంబర్ 6 : చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా అదనపు న్యాయమూర్తి జయంతి అన్నారు. శామీర్పేట మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల జగద్గిరిగుట్ట క్యాంపస్లో శనివారం ఉచిత న్యాయ సదస్సును శామీర్పేట పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి జయంతి మాట్లాడుతూ విద్యార్థులు చట్టాలు, న్యాయ వ్యవస్థపై అవగాహన కలిగి ఉండాలన్నారు. పోలీసులు, న్యాయ వ్యవస్థల పనితీరుపై ప్రజలకు నమ్మకం కలిగించేలా వ్యవస్థలు పనిచేయాలన్నారు. పేదలకు సత్వర న్యాయం అందించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో 21వ బెంచ్ మెట్రోపాలిటన్ న్యాయమూర్తి లావణ్య, సీనియర్ సెషన్స్ సివిల్ న్యాయమూర్తి రమేశ్, బార్ కౌన్సిల్ అధ్యక్షుడు కృష్ణ, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇష్రత్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.