మేడ్చల్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): స్వచ్ఛత, పరిశుభ్రతలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేలా అధికారులు కృషి చేయాలని అదనపు కలెక్టర్ శ్యాంసన్ అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో మంగళవారం అధికారులతో శ్యాంసన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యాంసన్ మాట్లాడుతూ స్వచ్ఛత, పరిశుభ్రతతో పాటు ప్రభుత్వం చేపట్టే అన్ని రకాల సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, అర్హులైన వారందరికి అందజేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రత్యేక కమిటీ పర్యవేక్షించి పనితీరు ఆధారంగా స్వచ్ఛత, పరిశుభ్రత పై ర్యాంకులను కేటాయించనున్నట్లు అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని జిల్లా స్థాయి అధికారుల నుంచి మండల, గ్రామస్థాయి అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల వివరాలు తెలుసుకుంటూ ప్రజలకు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద అర్హులైన వారికి పని కల్పించాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ పీడీ పద్మజరాణి, జడ్పీ సీఈవో మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.