కంటోన్మెంట్, ఆగస్టు 5: దళిత బంధుతోనే ఎస్సీలకు ఆర్థిక పరిపుష్టి సాధ్యమని, దేశానికి దళిత బంధు పథకం ఓ దిక్సూచిగా మారనుందని టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. తెలంగాణ సాధించిన సీఎం కేసీఆర్ ఇప్పుడు దళిత బంధును అమలు చేసి చూపిస్తున్నారని స్పష్టం చేశారు. ఈ క్రమంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ బుధవారం వాసాలమర్రి పర్యటనలో భాగంగా ఆ గ్రామంలో ఉన్న 76 దళిత కుటుంబాలతోనే దళితబంధు పథకానికి శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం యాదాద్రి జిల్లా కలెక్టర్కు సుమారు రూ.7.60 కోట్ల నిధులు విడుదల చేస్తూ జీవో జారీ చేయడం జరిగిందన్నారు. ఎక్కడా దిక్కులేని జాతీయ పార్టీల నేతలు అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. దళితబంధు కింద ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు కాకుండా రూ.50 లక్షలు ఇవ్వాలంటున్న కొంతమంది నేతలు తొలుత కనీసం రూ.50 వేలు అయినా ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. త్వరలోనే దళితబంధు పథకం మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో కూడా అమలు కాబోతుందన్నారు.