మేడ్చల్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): ధరణిలో భూ సమస్యలపై దరఖాస్తు చేసుకునే విధి విధానాలపై అవగాహన కల్పిస్తూనే.. సమస్యల పరిష్కారానికి నివృత్తి విచారణ కేంద్రాన్ని సంప్రదించే అవకాశాన్ని రెవెన్యూ అధికారులు కల్పించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేకంగా ధరణి పోర్టల్ సంబంధిత సందేహాల నివృత్తి విచారణ సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రెవెన్యూ అధికారులు తీసుకున్న ఈ నిర్ణయంతో సత్ఫలితాలు వస్తున్నాయి.
సందేహాల నివృత్తి కేంద్రంలో ఇద్దరు తహసీల్దార్లు ఉండి సమస్యలు తెలుసుకుంటూ ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలో రైతులకు అవగాహన కలిగిస్తున్నారు. దరఖాస్తులు పెండింగ్లో ఉంటే మాత్రం ఈ కేంద్రాన్ని సంప్రదిస్తే తక్షణమే చర్యలు చేపడుతున్నారు. ప్రతిరోజు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు నివృత్తి విచారణ సహాయక కేంద్రాన్ని తెరిచి ఉంచుతున్నారు. అయితే ప్రతిరోజూ అనేక మంది రైతులు ఈ కేంద్రాన్ని సందర్శిస్తూ సమస్యలను పరిష్కరించుకుంటున్నారు.
మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ధరణి పోర్టల్లో పెండింగ్లో ఉన్న 13,195 ఫైళ్లను రెవెన్యూ అధికారులు పరిష్కరించారు. జిల్లాలోని మేడ్చల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, మల్కాజిగిరి, ఉప్పల్ నియోజకవర్గాల నుంచి వివిధ సమస్యలపై 14 వేల 5 దరఖాస్తులు రాగా ఇందులో 13 వేల 195 దరఖాస్తులను పరిష్కరించారు. కోర్టు కేసులుంటే మాత్రం పెండింగ్లో పెడుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
ధరణి పోర్టల్పై ప్రజాప్రతినిధులతో కలెక్టర్ హరీశ్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. అపోహలను తొలగించడంతో పాటు అవగాహన కల్పించనున్నారు. త్వరలో ప్రజాప్రతినిధులకు ప్రత్యేక సమావేశం వివరాలు వెళ్లడిస్తామని కలెక్టర్ తెలిపారు. ధరణి పోర్టల్తో అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సమస్యలకు మోక్షం లభించిందన్నారు.