KP Vivekananda | కుత్బుల్లాపూర్, జూన్ 20: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తీవ్రంగా మండిపడ్డారు. ప్రజలను నానాయాతన పెడుతూ రాష్ట్రాన్ని పూర్తిగా అధోగతి పాలు చేస్తుందని విమర్శించారు. హైదరాబాద్ చింతల్లోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేపీ వివేకానంద మాట్లాడుతూ.. కాంగ్రెస్ది పేరుకే ప్రజాపాలన.. వాస్తవానికి ప్రజలను హింసించే పాలనగా సాగుతుందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాక్షస పాలన సాగుతోందని ఆరోపించారు.
కేసీఆర్ పాలన స్వర్ణయుగం- రేవంత్ పాలన నరకప్రాయం
పదేళ్ల పాటు కేసీఆర్ పాలనలో వ్యవసాయాన్ని ఒక పండుగలా మార్చారని కేపీ వివేకానంద తెలిపారు. రైతులను కంటికి రెప్పలా కాపాడుకుంటూ, కడుపులో పెట్టుకుని చూసుకున్నారని కొనియాడారు. సకాలంలో విత్తనాలు, యూరియా అందించడమే కాకుండా, సమయానికి ‘రైతు బంధు’ డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లో వేసి, పండించిన ప్రతి ధాన్యాన్ని కొనుగోలు చేసి అన్నదాతకు బంగారు బాట వేశారని పేర్కొన్నారు. కానీ నేడు రేవంత్ రెడ్డి రాక్షస పరిపాలనలో రైతులంతా హింసను అనుభవిస్తున్నారని, రైతులకు నరకం చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయానికి విత్తనాలు లేవు, యూరియా కోసం రైతులు రోడ్లపై పడిగాపులు కాస్తూ యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు పేరు మార్చి రైతు భరోసా అని పెట్టారని.. కానీ అది భరోసా కాదు.. రైతు మోసం అని అన్నారు. రైతు భరోసా కింద ఒక్క రైతుకు కూడా డబ్బులు ఇవ్వలేదని విమర్శించారు.
సంపూర్ణ రుణమాఫీ చేస్తానని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని కేపీ వివేకానంద మండిపడ్డారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బోరంపేట పీఏసీఎస్ పరిధిలో 632 మంది రైతులకు కేవలం 13 మందికే రుణమాఫీ అయ్యిందని తెలిపారు. రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి గజదొంగలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనకపోతే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయదా అని పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి ప్రశ్నించారని గుర్తుచేశారు. కేంద్రం వడ్లు కొనుగోలు చేయకపోతే కిషన్ రెడ్డి ఇంటి ముందు వడ్లు పోస్తానని శపథం చేసిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు మోదీకి సరెండర్ అయిపోయాడని విమర్శించారు. రేవంత్ రెడ్డి చేతగానితనాన్ని, డొల్లతనాన్ని, అసమర్థను ఆయన ప్రకటనలే బయటపెడుతున్నాయని అన్నారు.
మూసీ ప్రక్షాళన, మెట్రో రైలు విస్తరణ, ఫోర్త్ సిటీ, కాళేశ్వరం రిపేర్లు ఇలా ప్రతిదాంట్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని అన్నారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావుపై దుమ్మెత్తిపోస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ మోసాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని.. ఈ చేతగాని ప్రభుత్వాన్ని గద్దె దించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గులాబీ జెండా ఎగురడం, మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
రైతాంగానికి చేసిన మోసానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తక్షణమే రైతు బీమా ప్రీమియం చెల్లించాలని, రైతు భరోసా కింద ఎకరానికి రూ.15వేలను రైతుల ఖాతాలో జమ చేయాలలన్నారు. లేదంటే అసెంబ్లీ వేదికగానే కాకుండా, రోడ్లపైకి వచ్చి ప్రజా పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి సర్కార్ మెడలు వంచైనా రైతుల హక్కులను సాధించుకుంటామని స్పష్టం చేశారు.