కీసర, నవంబర్ 2: కార్తీక మాసోత్సవం పూజలకు కీసర గుట్ట ఆలయం ముస్తాబవుతోంది. తెలంగాణలో సుప్రసిద్ధ శైవక్షేత్రంగా పేరొందిన కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 5 నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు కార్తీక మాసోత్సవం పూజలు నిర్వహించనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థానం వారు ఏర్పాట్లు చేస్తున్నారు.
కార్తీక మాసంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కీసర గుట్టకు విచ్చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కార్తీక దీపాలను వెలిగిస్తారు. నెలరోజుల పాటు నిర్వహించే ఈ పూజల్లో శివభక్తులు అధిక సంఖ్యలో కీసరగుట్టకు విచ్చేస్తారు. భక్తులు సేద తీర్చుకునేందుకు ఆలయం వద్ద చలువ పందిళ్లను ఏర్పాటు చేశామని ఆలయ చైర్మన్ తటాకం నాగలింగంశర్మ, ఆలయ కార్యనిర్వహణాధికారి కట్ట సుధాకర్రెడ్డి తెలిపారు.
ఈనెల 5వ తేదీన స్వామివారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, 8న శ్రీ స్వామివారికి నానావిధ ఫల రసాభిషేకం,10న శ్రీవల్లి దేవసేన సహిత శ్రీ సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం, 15న శ్రీస్వామికి చెరుకు రాసాభిషేకం, సత్యనారాయణవ్రతం, 19న పౌర్ణమిన శ్రీస్వామికి నానావిధ పత్ర పూజ, మహాలింగ దీపోత్సవం జ్వాలా తోరణం, 22న శ్రీ స్వామివారికి పంచామృతాభిషేకం, గంధాభిషేకం, వినాయకస్వామికి ప్రత్యేక పూజలు, 23న అర్ధ నక్షత్రం శ్రీ భవానీ శివదుర్గా సమేత శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం, 29వ తేదీ సోమవారం శ్రీ స్వామివారికి పాలాభిషేకం, భస్వాభిషేకం, 30న శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, డిసెంబర్ 2న మాస శివరాత్రి రుద్రహోమం, నానావిధ పత్రిపూజ, 3న విశాఖ నక్షత్రం శ్రీ సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం, 4న శ్రీస్వామి వారికి తైలాభిషేకంతో కార్తీక మాసం పూజలు ముగియనున్నాయి.