మేడ్చల్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : మేడ్చల్ జిల్లా మాదారం ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు లైన్క్లియర్ అయింది. 229 ఎకరాలలో ఏర్పాటు కానున్న ఇండస్ట్రియల్ పార్క్కు సంబంధించి భూసేకరణ ప్రక్రియ వేగవంతం అయింది. రైతుల అంగీకారంతో ఎకరాకు రూ.32 లక్షల చొప్పున పరిహారం ఇచ్చేందుకు నిర్ణయించారు. మొత్తం 110మంది రైతులకు 15 రోజులలో రూ. 73.28 కోట్లను చెల్లించి, సదరు భూమిని టీఎస్ఐఐసీకి అప్పగించనున్నారు. భూపరిహారం చెల్లింపులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా భూ సేకరణ అధికారి లింగ్యానాయక్ వెల్లడించారు.
ఇండస్ట్రియల్ లే అవుట్..
రెవెన్యూ యంత్రాంగం 229ఎకరాల భూమిని టీఎస్ఐఐసీకి అప్పగించిన వెంటనే లే అవుట్ ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 229 ఎకరాలలో సుమారు వందకుపైగా పరిశ్రమలు ఏర్పడే విధంగా లే అవుట్ను రూపొందించనున్నారు. లే అవుట్ కాగానే పారిశ్రామికవేత్తల నుంచి పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తులు స్వీకరిస్తామని టీఎస్ఐఐసీ అధికారులు తెలిపారు.
వేలాది కోట్ల పెట్టుబడులు..
అత్యధిక పరిశ్రమలతో ఇప్పటికే రాష్ట్రంలో మేడ్చల్ జిల్లా నెంబర్వన్ స్థానంలో ఉంది. తాజాగా మాదారం ఇండస్ట్రియల్ పార్క్లో నూతన పరిశ్రమలు ఏర్పడితే సుమారు 2 వేల కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుందని టీఎస్ఐఐసీ అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో చిన్న, పెద్ద పరిశ్రమలు 8500 వరకు ఉండటంతో 2.50లక్షల పైచిలుకు మంది ఉపాధి పొందుతున్నారు. మాదారం ఇండస్ట్రియల్ పార్క్ హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉండటంతో వేలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభించనుంది.