మేడ్చల్ : గిరిజన భూములతో తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి (Mla Malla reddy) స్పష్టం చేశారు. తనపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదుపై కోర్టును ఆశ్రయించినట్లు గురువారం మీడియాకు వివరించారు. గిరిజన భూముల(Tribals Lands) తో తనకు ఎలాంటి సంబంధం లేకుండా అట్రాసిటి కేసును ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు.
భూములను అక్రమించినట్లు వచ్చిన ఆరోపణలలో ఎలాంటి నిజం లేదన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మూడుచింతల పల్లి కేశవరంలోని 47 ఎకరాల 18 గుంటల భూమిలో తన పేరిట పాస్బుక్ లేదా పహణీలోనైనా తన పేరు ఎక్కడా లేదని పేర్కొన్నారు. ఎలాంటి ఆధారం లేకుండా కేసు నమోదు ఎందుకు చేశారో అర్థం కావడం లేదన్నారు.
తాను గిరిజనుల భూమిని ఆక్రమించినట్లు ఉంటే ఆధారాలు చూయించాలని డిమాండ్ చేశారు. తనపై తప్పుడు కేసు నమోదు చేసిన వారిపై కోర్టు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. భూ అక్రమణలను తనెప్పుడూ పాల్పడలేదని అలాంటి అవసరం తనకు లేదన్నారు. మంత్రిగా నియోజకవర్గ అభివృద్థితో పాటు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేశానని తెలిపారు.