మేడ్చల్, జూన్ 26(నమస్తే తెలంగాణ): నకిలీ విత్తనాల విక్రయాలపై అధికారులు నిఘా పెట్టారు. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా నకిలీ విత్తనాల విక్రయాలు జరగకుండా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు టాస్స్ఫోర్స్ బృందం నకిలీ విత్తనాలపై నిఘా పెట్టింది. జిల్లాలోని వివిధ విత్తన కంపెనీలు, డీలర్ల వద్ద తనిఖీలు కొనసాగిస్తూ నకిలీ విత్తనాలను అరికడుతున్నారు. ఇప్పటి వరకు వివిధ విత్తన కంపెనీలు, డీలర్లలైన 15 మందిపై కేసులు నమోదు చేసినట్లు మేడ్చల్ జిల్లా వ్యవసాయాధికారి మేరి రేఖ వెల్లడించారు. నకిలీ, గడువు ముగిసిన విత్తనాలు, రికార్డులు సరిగ్గా నమోదు చేయని వారిపై కేసులు నమోదు చేసి.. ఆరుగురిని అరెస్ట్ చేశారు.
మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో 395 క్వింటాళ్లు నకిలీ విత్తనాలను సీజ్ చేశాం. విక్రయాలకు అనుమతి లేకుండా 14,021 క్వింటాళ్ల విత్తనాలను నిషేధించాం. ఇప్పటి వరకు 15 మంది విత్తన కంపెనీలు, డీలర్లపై కేసులు నమోదు చేసి.. ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ విత్తనాల విక్రయాలు జరగకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నాం.- మేరి రేఖ, మేడ్చల్ జిల్లా వ్యవసాయాధికారి