మేడ్చల్, ఆగస్టు 19(నమస్తే తెలంగాణ): భూ సమస్యలను పరిష్కరించుకునేలా రెవెన్యూ అధికారులు ధరణి (సెల్) సహాయ కేంద్రం ద్వారా చర్యలు చేపట్టారు. మేడ్చల్ జిల్లా కలెక్టరేట్లో ధరణి(సెల్) సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రైతులు సులభతరంగా భూ సమస్యలను పరిష్కరించుకునేందుకు ధరణి సహాయ కేంద్రం దోహదపడనుంది. భూ సంబంధిత సమస్యలపై, యజమానులు కలెక్టరేట్లోని ధరణి సహాయక కేంద్రాన్ని సందర్శించి సమస్యను వివరిస్తే తీసుకోవాల్సిన చర్యలపై డిప్యూటీ తహసీల్దార్ స్థాయి గల ఇద్దరు అధికారులు అవగాహన కల్పించనున్నారు. ప్రతి రోజు ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ధరణి సహాయక కేంద్రంలో సలహాలు పొందవచ్చు.
భూమి యజమానులు ధరణిలో నమోదుకు చేసుకునేందుకు మీ సేవా కేంద్రంలో దరఖాస్తు విధి విధానాలను తెలియజేయనున్నారు. ఇందులో వారసత్వం, పాస్బుక్లలో డిజిటల్ సైన్లు, పాస్బుక్లలో తప్పిపోయిన సర్వే నెంబర్లు, పట్టాదారు పాసు పుస్తకాలలో తప్పులు సరిచేయుట, నిషేధిత జాబితా నుంచి భూమి సర్వే నెంబర్ల తొలగింపునకు మీ సేవా కేంద్రాలలో ఏ విధంగా దరఖాస్తు చేయాలనే విషయమై క్షుణ్ణంగా అధికారులు వివరించి సహకారం అందించనున్నారు. రైతులు సలభతరంగా పోర్టల్ సంబంధిత సందేహాల నివృత్తి, విచారణను ధరణి సహాయ కేంద్రం అందించనుంది. ధరణి సహాయ కేంద్రానికి వచ్చిన రైతులకు భూ సమస్యల పరిష్కారంపై పూర్తి స్థాయిలో సమాచారం అందించాలని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి ఆదేశించారు.
మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ధరణిలో ఏడువేల పెండింగ్ ఫైళ్లను రెవెన్యూ అధికారులు పరిష్కరించారు. మరో 2011 ఫైళ్లను త్వరలోనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ధరణికి సంబంధించిన ఫైళ్లను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించిన విషయం తెలిసిందే. దరఖాస్తులు వచ్చిన వెంటనే విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటున్నారు. ధరణిలో 7వేల ఫైళ్లను పరిష్కరించంగా మరో 2011 ఫైళ్లను పరిష్కరించాల్సి ఉందని అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి వెల్లడించారు. ధరణి సహాయ కేంద్రంలో భూ సమస్యలపై సందేహాలు నివృత్తి చేసుకునే అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ సూచిస్తున్నారు.