శామీర్పేట, మార్చి 24 : లక్ష్మాపూర్ గ్రామ రెవెన్యూ నక్షాను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ శ్వేతా మహంతి అధికారులను ఆదేశించారు. మేడ్చల్ జిల్లా మూడుచింతపల్లి మండలం లక్ష్మాపూర్ గ్రామంలో బుధవారం సాయంత్రం కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించారు. అధికారులు చేస్తున్న భూ సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక రైతులతో మాట్లాడి, సర్వే పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి చెందిన రైతు విలాసాగరం తిరుపతి తమ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరికి 3.29 ఎకరాల చొప్పున ఆరు మందికి 19 ఎకరాల భూమి ఉండాల్సి ఉండగా, ఎకరా, రెండెకరాలు, 17 గుంటల చొప్పున రికార్డుల్లో చూపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మరో రైతు గురుస్వామికి మూడెకరాల భూమి ఉండగా, సర్వేలో 3.3 ఎకరాల భూమిగా రికార్డు చేసినట్టు తెలుసుకున్నారు. అధికారులు సర్వే చేసే సమయంలో రైతులు, ఇతరులు చూపించిన సరిహద్దులను కాకుండా నిర్దిష్టమైన హద్దులతో సర్వేను పూర్తి చేయాలన్నారు. పారదర్శకంగా సర్వే నిర్వహించి, త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అడిషనల్ కలెక్టర్ విద్యాసాగర్, ఆర్డీవో రవి, తాసీల్దార్ సురేందర్, గోవర్దన్, సర్వే ఏడీ రాంచందర్, సర్పంచ్ సింగం ఆంజనేయులు, ఎంపీటీసీ నాగరాజు, ఉపసర్పంచ్ వైద్యనాథ్ పాల్గొన్నారు.