దుండిగల్, జూన్18 : కృషి, పట్టుదల, క్రమశిక్షణే విజయానికి కారణమని, పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి భవిష్యత్ లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలని మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి విద్యార్థులకు సూచించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని బాచుపల్లి , బౌరంపేట్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను బుధవారం ఆకస్మికంగా సందర్శించి, తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో ఏమి చదువుతారని, ఏ-గ్రూపు తీసుకుంటారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని, విద్యతోనే భవిష్యత్ బాగుంటుందని చెప్పారు.
కలెక్టర్ నేరుగా పదో తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ స్కూల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయా..? అని అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో స్పోర్ట్స్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఎగుడుదిగుడుగా ఉన్న గ్రౌండ్ను లెవల్ చేయించాలని విద్యార్థులు కలెక్టర్ను కోరారు. స్పందించిన కలెక్టర్ తప్పకుండా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పాఠశాలకు అవసరమైన అంశాలతో నివేదిక తయారు చేసి తనకు పంపాలని ప్రధానోపాధ్యాయుడిని ఆదేశించారు. గతంలోనే అదనపు గదుల కోసం నివేదిక పంపామని చెప్పగా.. మరోసారి నివేదిక పంపాలని.. అవసరమైన మేరకు మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.