ఘట్కేసర్ : సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్శితులై ప్రతిపక్షాలకు చెందిన పార్టీలతో పాటు కులసంఘాలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారు. బుధవారం మేడ్చల్ నియోజకవర్గం ఘట్కేసర్లో 5 వందల మంది వడ్డెర కులస్తులు వడ్డెర సంఘం ఉపాధ్యక్షుడు శివరాత్రి వెంకటేశ్ ఆధ్వర్యంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy) సమక్షంలో బీఆర్ఎస్ (BRS) లో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మేడ్చల్ నియోజక వర్గంలో కొనసాగుతున్న చేరికలతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఖాళీ అవడం ఖాయమని అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR ) రాష్ట్రంలోని పేద ప్రజలు, అన్ని కుల వృత్తులకు, అన్ని వర్గాలకు సముచిత న్యాయం కల్పిస్తూ వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్లోకి రావడానికి ఉత్సాహం చూపుతున్నారని వివరించారు.
సీఎం కేసీఆర్ సాహాసోపేత నిర్ణయాలు తీసుకుంటూ వాటిని సమర్ధవంతంగా అమలు చేస్తుండడంతో దేశంలోనే తెలంగాణ (Telangana) అన్ని రంగాల్లో ప్రథమ స్థాయిలో నిలిచిందని అన్నారు. మరోసారి సీఎంగా కేసీఆర్ను అధిక మెజారిటీతో గెలుపించుకుంటే రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో నిలుపుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు చామకూర భద్రరెడ్డి , ఘట్కేసర్ చైర్పర్సన్ ముల్లి పావనీ జంగయ్య యాదవ్, బీఆర్ఎస్ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ మాధవ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు కొంతం అంజిరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేశ్ తదితరులు పాల్గొన్నారు.