కీసర, ఆగస్టు 9: కీసరగుట్ట శ్రీ భవాని రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఘనంగా శ్రావణమాసోత్సవ పూజలు ప్రారంభమయ్యాయి. శ్రావణ మాసం మొదటి సోమవారం కావడంతో రామలింగేశ్వరుడికి వేద పండితులు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. భారీగా తరలివచ్చిన భక్తులు స్వామి వారికి అభిషేకాలు చేశారు. అనంతరం శ్రీ కాశీ విశ్వేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేసి లక్ష్మీ నరసింహుడు, నాగమాతను దర్శించుకున్నారు. గుట్ట పరిసర ప్రాంతాల్లోని శివ లింగాలకు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. భారీగా తరలివస్తున్న భక్తుల కోసం కరోనా నిబంధనల మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ చైర్మన్ తటాకం నాగలింగశర్శ, ఆలయ కార్యనిర్వహణాధికారి సుధాకర్రెడ్డి తెలిపారు.