పెద్దఅంబర్పేట, నవంబర్ 6: ‘హలో.. సర్ మేం మున్సిపల్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం. మీ ఇంటిపై చాలా పన్ను పెండింగ్లో ఉన్నది. ఇప్పుడు చెల్లించండి. మీకు బకాయి పన్నులమీద వేసిన వడ్డీలో 90 శాతం మాఫీ వస్తుంది’ ఇంటి యజమానులకు ఫోన్లు చేసి బిల్ కలెక్టర్లు చేసిన విజ్ఞప్తి ఇది.
‘సర్.. ఈ భవనంపై అరకోటి వరకు పన్ను బకాయి ఉన్నది. పన్నులు కడితేనే మున్సిపాలిటీలోని వార్డుల్లో అభివృద్ధి సాధ్యం. తప్పకుండా చెల్లించాల్సిందే. లేదంటే భవనానికి తాళాలు వేసేందుకు కూడా వెనుకాడం’ ఓ పెద్ద భవనంలో కిరాయికి ఉంటున్నవారికి కమిషనర్ హెచ్చరిక ఇది. ఈ విజ్ఞప్తులు, హెచ్చరికలకు ఫలితం దక్కింది. పెద్దఅంబర్పేట మున్సిపాలిటీలో గతంలో ఎన్నడూ లేని విధంంగా బకాయి పన్ను వసూలైంది. మూడునెలల్లో (అక్టోబర్ 31 వరకు ) రూ.4.47 కోట్లు వసూలైందని అధికారులు చెప్తున్నారు. ఇది మున్సిపల్ అధికారులు పెట్టుకున్న లక్ష్యంలో దాదాపు 75 శాతం.
ప్రతి పన్నుపై ప్రత్యేక దృష్టి
మున్సిపల్ అధికారులు బకాయి పన్నుల వసూళ్లపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. ప్రతి పన్ను బకాయిదారుకు సమాచారం పంపారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న మాఫీ సదుపాయం గురించి వివరించారు. దీనిపై అవగాహన సైతం కల్పించారు. పన్నుమీద వేసే వడ్డీలో 90 శాతం మాఫీ లభిస్తున్నదని చైతన్యం తీసుకొచ్చారు. నిత్యం ఫోన్లు చేస్తూ.. ‘పన్నులు చెల్లించండి. వడ్డీపై మాఫీ పొందండి’ అని విజ్ఞప్తులు చేశారు. ఫలితంగా చాలామంది పన్నులు చెల్లించేందుకు ముందుకొచ్చారు. వడ్డీపై లభించే మాఫీని పొందేందుకు ఆసక్తి చూపారు. వీరిని కమిషనర్ నిత్యం పర్యవేక్షించారు. మూణ్నెళ్ల వ్యవధిలో పెట్టుకున్న టార్గెట్లో 75 శాతం అంటే రూ.4.47 కోట్లు వసూలైంది.
గతంలో తక్కువే
మున్సిపాలిటీ 2020-21లో రూ.3.89 కోట్ల పన్ను బకాయిలు ఉండ గా.. కేవలం 15 శాతం అంటే రూ.58 లక్షలు మాత్రమే వసూలైంది. 675 మంది మాత్రమే వడ్డీ మాఫీ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. గతంలోనూ ఈ కార్యక్రమంపై ప్రచారం నిర్వహించినా స్పందన అంతంత మాత్రంగానే ఉన్నది. ఇక 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.4.17 కోట్ల పన్ను బకాయి ఉండగా.. రూ.1.21 కోట్లు మాత్రమే వసూలైంది. అంటే వసూలైంది 29 శాతమే. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23లో రూ.5.97 కోట్ల పన్ను బకాయిలకుగాను రూ.4.47 కోట్లు వసూలైంది. ఇది పెట్టుకున్న లక్ష్యంలో 75 శాతమని అధికారులు చెప్తున్నారు. పెద్ద బకాయిదారుపై మున్సిపల్ అధికారులు ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ఓ జాబితాను తయారు చేశారు. ఎవరు ఎంత బకాయి ఉన్నారు? ఎంతకాలంగా బకాయి ఉన్నారు? చెల్లించకపోవడానికి గల కారణాలు ఏమిటి? ఇలా ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. ఆపై నిబంధనల ప్రకారం బకాయిలు చెల్లించాల్సిందేనని ఒత్తిడి తీసుకొచ్చారు. కొందరు భవన యజమానులకు నేరుగా నోటీసులు పంపించారు. మరికొన్ని చోట్ల కిరాయికి ఉంటున్నవారిపై ఒత్తిడి తెచ్చి పన్ను బకాయిలు వసూలు చేయించారు.
వందశాతం వసూలే లక్ష్యం
మున్సిపాలిటీలో వందశాతం పన్ను బకాయిలు వసూలు చేయాలనుకున్నాం. అందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. బిల్ కలెక్టర్లు ప్రతి ఇంటికీ వెళ్లి యజమానులను కలిసి పన్ను బకాయిల గురించి వివరిస్తున్నారు. యజమానులకు ఏమైనా సందేహాలుంటే నేరుగా కార్యాలయానికి రావొచ్చు. అధికారులను కలువొచ్చు. మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఏమైనా తప్పులు ఉన్నా సరిచేస్తాం. ప్రతి ఒక్కరూ పన్ను కట్టాల్సిందే.
– పీ రామాంజులరెడ్డి, కమిషనర్, మున్సిపాలిటీ