హవేళీఘనపూర్, మార్చి 29: పర్యాటక కేంద్రాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బుధవారం హవేళీఘనపూర్ మండలంలోని పోచారం అభయారణ్యాన్ని సందర్శించారు. పర్యాట కేంద్రం అభివృద్ధికి ఆ శాఖ కోరినట్లుగా రెవెన్యూ అధికారులు గుర్తించిన స్థలం గురించి ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పర్యాటక కేంద్రంగా మెదక్- కామారెడ్డి జిల్లాల సరిహద్దులో ఉన్న పోచారం డ్యామ్, అభయారణ్యానికి ఉన్న ప్రాముఖ్యతను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధికి కావాల్సిన వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నదని కలెక్టర్ తెలిపారు. అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. మెదక్ జిల్లా రెవెన్యూ పరిధిలోని 8 ఎకరాలు, కామారెడ్డి జిల్లా పోచారం డ్యామ్ మధ్యలో ఉన్న గుట్ట 15 ఎకరాల భూమిని పర్యాటక శాఖకు అప్పగించనున్నట్లు అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. పోచారం పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు, పర్యాటకులను ఆకర్షించేలా బోటింగ్ సదుపాయం, 15 ఎకరాల ఐలాండ్ స్థలాన్ని అభివృద్ధి చేసి కాటేజీల నిర్మాణం, కన్వెన్షన్ సెంటర్, పార్కింగ్, లైటింగ్, అడ్వైంచర్ గేమ్స్ వంటివి కల్పించనున్నట్లు తెలిపారు. 3 ఎకరాల స్థలంలో పర్యాటకులకు అతిథి గృహాన్ని ఏర్పాటు చేసి, అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కృషి చేయనున్నట్లు తెలిపారు. అనంతరం పోచారం అభయారణ్యంలో ఏర్పాటు చేసిన ఫారెస్టు ప్లస్ రీజనల్ డైరెక్టర్ సాయిలు పవర్ పాయింట్ ప్రజంటేషర్ ద్వారా పర్యావరణ అభివృద్ధికి చేస్తున్న కృషి, నేచర్ ఎడ్యూకేషన్ క్యాంపుల గురించి వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర రమేశ్, పర్యాటక శాఖ ఓఎస్డీ సత్యనారాయణ, నీటి పారుదల శాఖ ఎస్ఈ యేసయ్య, కామారెడ్డి ఎస్ఈ పద్మావతి, డీఈ శ్రీనివాసరావు, డీఎఫ్వో రవిప్రసాద్, ఆర్డీవో సాయిరామ్, హవేళీఘనపూర్ ఇన్చార్జి తహసీల్దార్ నవీన్, ఎఫ్ఆర్వో మనోజ్ పాల్గొన్నారు.
మెదక్ మున్సిపాలిటీ, మార్చి 29: కృషి, పట్టుదల ఉంటే పారిశ్రామిక వేత్తలుగా ఎదగొచ్చని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ ఫెడరేషన్ చాంబర్స్ అండ్ కామర్స్ ఇండస్ట్రీస్, వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల ఎంపవర్మెంట్ మెంటర్ షిప్ ప్రోగ్రాం శిక్షణా తరగతుల ముంగింపు కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా ఆత్మవిశ్వాసం, స్వయం శక్తితో విద్యార్థులు ముందుకెళ్లాలన్నారు. జిల్లా స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ మాట్లాడుతూ మీరు తయారు చేసిన చిన్న వస్తువులను మెదక్ జిల్లా మంజీరా మార్కెటింగ్ గ్రూప్ ద్వారా విక్రయించుకునే సౌకర్యం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. తెలంగాణ చాంబర్స్ ప్రెసిడెంట్ అనిల్ అగర్వాల్ మాట్లాడుతూ విద్యార్థుల చిరు వ్యాపారాలకు ఆర్థికంగా తోడ్పాటు అందిస్తామన్నారు. ఈ శిక్షణా తరగతుల్లో కళాశాల ప్రిన్సిపాల్ గణపతి, ఉమెన్ సెల్ కో ఆర్డినేటర్లు సమీ రా, సరితారాణి, విద్యార్థులు పాల్గొన్నారు.
మెదక్రూరల్, మార్చి 29: అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటల వివరాలు అందజేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. చీఫ్ సెక్రటరీ కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ నేపథ్యంలో వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, సహాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారితో గూగుల్ మీట్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ దెబ్బతిన్న పంటలను వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్ర స్థాయిలో సందర్శించాలని సూచించారు. పంట నష్టం వివరా లను పూర్తిగా అందజేయాలని జిల్లా అధికారులకు పంపించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేశ్, జిల్లా వ్యవసాయాధికారి ఆశాకుమారి పాల్గొన్నారు.