రంగారెడ్డి, డిసెంబర్ 2(నమస్తే తెలంగాణ)/వికారాబాద్ : అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలు ఓటరు జాబితాలో ఉండేలా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నారని జిల్లా కలెక్టర్ అమయ్కుమార్ తెలిపారు. కేంద్ర సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేశ్కుమార్వ్యాస్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక ఓటర్ సవరణ జాబితా 2023 రూపకల్పనపై వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఇందులో రంగారెడ్డి జిల్లా నుంచి కలెక్టర్ అమయ్కుమార్, వికారాబాద్ జిల్లా నుంచి అదనపు కలెక్టర్ రాహుల్శర్మ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రంగారెడ్డి కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే 6,561 దరఖాస్తులొచ్చాయని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో బూత్స్థాయి అధికారులు ఓటరు నమోదు, సవరణ సంబంధిత దరఖాస్తు ఫారాలతోపాటు ఓటరు జాబితాలను అందుబాటులో ఉంచారన్నారు. గోడ ప్రతులు, కరపత్రాలు, మైకులు, సోషల్ మీడియా, దినపత్రికల ద్వారా ప్రజలకు తెలిసేందుకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.
ఈ నెల మూడు, నాలు గు తేదీల్లో జరుగనున్న ప్రత్యేక శిబిరాలకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. నూతన ఓట రు, పేరు, చిరునామా మార్పులు, మరణించిన వారి వివరాల తొలగింపు, ఆధార్ కార్డు అనుసంధానం, జాబితా సవరణలపై సంబంధిత అధికారుల సమన్వయంతో చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ తెలిపారు. అనంతరం వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ శని, ఆదివారాల్లో ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు బీఎల్వోలు పోలింగ్ బూత్ల వద్ద అందు బాటులో ఉండాలన్నారు. యువకులు ఓటుహక్కు పొందేలా కళాశాలలు, విద్యాసంస్థల్లో అవగాహన కల్పించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో డీఆర్వోలు హరిప్రియ, అశోక్కుమార్, ఎన్నికల విభాగం అధికారులు, రవీందర్దత్తు తదితరులు పాల్గొన్నారు.